టాటా గూడ్స్, ప్రైవేట్ అంబులెన్స్ ఢీ
క్యాబిన్లలో ఇరుక్కున్న డ్రైవర్లు
రక్షించిన పోలీసులు
రాయపర్తి సమీపంలో ఘటన
రాయపర్తి, జూన్ 5 : మితిమీరిన వేగంతో వస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ వాహనం ఎదురుగా వస్తున్న టాటా గూడ్స్ వాహనాన్ని ఢీకొన్న ఘటన శనివారం మండల కేంద్ర శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో వరంగల్-ఖమ్మం హైవేపై చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంలోని శ్రీనిధి దవాఖానకు అనుబంధంగా ఉన్న అమ్మ అంబులెన్స్ సర్వీస్ విభాగానికి చెందిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ రాయపర్తి నుంచి వరంగల్ వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన జోగు సోమన్న, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రెవెన్యూ డివిజన్కు చెందిన వెలిశాల సంపత్ తమ టాటా లేలాండ్ గూడ్స్ వాహనాల్లో వరంగల్ నుంచి రాయపర్తి వైపు విత్తన బస్తాల లోడ్తో వస్తున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ మహేశ్ అదుపు తప్పి జోగు సోమన్న గూడ్స్ వాహనాన్ని ఢీకొన్నాడు.
ఈ ఘటనలో అంబులెన్స్, టాటా గూడ్స్ వాహనాలు నుజ్జునుజ్జుకాగా ఇరు వాహనాల డ్రైవర్లు సోమన్న, మహేశ్ అందులోనే చిక్కుకుని హాహాకారాలు చేయసాగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్ధలికి చేరుకుని వర్ధన్నపేట సీఐ డీ విశ్వేశ్వర్కు సమాచారమిచ్చారు. పొక్లెయినర్, డీసీ ఎం సహాయంతో ఇరు వాహనాల క్యా బిన్లను విడదీశారు. సీఐ విశ్వేశ్వర్తోపాటు ఏఎస్సై వెంకటేశ్వర్లు, ట్రైనీ ఎస్సై మంగ, సిబ్బంది తూళ్ల సంపత్, బొట్ల రాజు, పూర్ణచందర్రెడ్డి బాధితులను దవాఖానకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ రమేశ్ పరిశీలించారు.
సీఐ విశ్వేశ్వర్ మానవత్వం
టాటా గూడ్స్ వాహన డ్రైవర్ సోమన్నను క్యాబిన్లోంచి తీసేందుకు గడ్డపారతో విశ్వ ప్రయత్నం చేసిన సీఐ విశ్వేశ్వర్ బాధితుల ప్రాణాలను రక్షించేందుకు కృషి చేశారు. డ్రైవర్ సోమన్నను సీఐ విశ్వేశ్వర్ స్వయంగా మోస్తూ తన వాహనం వద్దకు తీసుకెళ్లి వర్ధన్నపేటలోని దవాఖానకు క్షణాల్లో చేర్పించాలంటూ తన డ్రైవర్ను ఆదేశించారు. 108 అందుబాటులో లేకపోవడంతో తన వాహనాన్ని పంపిన సీఐ ఆ తర్వాత తన కారు లో వర్ధన్నపేటకు తిరిగి వెళ్లారు.