రిటైర్డ్, మహిళా ఉద్యోగులపై ప్రత్యేక అభిమానం
కృతజ్ఞతగా ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు
స్వీట్లు పంచుకొని పటాకులు కాల్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తిన ఆనందం
ఇది ఎంప్లాయీస్ ఫ్రెండీ ప్రభుత్వం : సంఘాల నేతలు
వరంగల్, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో వ్యవహరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ప్రస్తుతం ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లోనూ వేతన సవరణ ప్రక్రియలో 30శాతం ఫిట్మెంట్ ప్రకటించడం అందరిలో సంతోషం నింపింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వలంటీర్లు, కేజీబీవీ-సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీఆర్ఏలు, వీఏవోలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్డ్, డెయిలీ వేజ్, తదితర ఉద్యోగులందరికీ వేతనాల పెంపుదల అమలు కానుంది.
వేతనాల పెంపు, ప్రమోషన్లు, బదిలీలు, రిటైర్మెంట్ అలవెన్సులు.. అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన జీవన ప్రమాణాలతో సగటు ఆయు ప్రమాణాలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సును 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచడంపై హర్షం వ్యక్తమవుతోంది. అన్ని స్థాయిల్లో అర్హులైన వారికి పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం వారిలో ఉత్సాహం నింపింది. పదోన్నతులు, బదిలీలపైనా స్పష్టత ఇవ్వడంతో అందరిలోనూ ఆనందం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్ ప్రకటనతో అన్ని స్థాయిల ఉద్యోగులు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సంబురాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని, కృతజ్ఞతను చాటుకుంటున్నారు.
సంక్షేమంపైనా ప్రత్యేక శ్రద్ధ
పీఆర్సీ అమలుతోపాటు తమ సంక్షేమంపైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం నూతన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఉద్యోగ సంఘాలు, ఉన్నతాధికారులతో కమిటీని వేయాలని నిర్ణయించడం శుభపరిణామమని పేర్కొంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో గొప్పగా ఆలోచించిందంటూ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 75 ఏండ్లు దాటిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ మొత్తాన్ని ఇస్తుండగా సీఎం కేసీఆర్ ఈ వయో పరిమితిని 70 ఏండ్లకు తగ్గించడం, రిటైర్మెంట్ గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచడం, ప్రమోషన్లను, బదిలీలను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన, ఆయా మేనేజ్మెంట్ల వారీగా పూర్తి చేయాలని నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాథమిక పాఠశాలలకు ఇప్పటివరకు లేని ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు ఒకే జిల్లాలో పని చేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించడంపై ఉద్యోగులైన దంపతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. కేజీబీవీల్లో పని చేసే మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవుల సౌకర్యాన్ని కల్పించి సీఎం కేసీఆర్ మహిళా ఉద్యోగుల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా అందరి సమస్యలను పరిష్కరించడంతో పాటు సంక్షేమం కోసం పెద్ద మనసుతో నిర్ణయాలు తీసుకున్నారని, తాము కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఉద్యోగులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, అధికారులు చెబుతున్నారు.