వరంగల్ చౌరస్తా, మార్చి 31: వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రేడియాలజీ సెంటర్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్లలో తనిఖీలు చేసేందుకు వరంగల్ అర్బన్ జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ కే లలితాదేవి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. కలెక్టర్ ఆర్జీ హన్మంతు ఆదేశాల మేరకు తనిఖీలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం హన్మకొండ బాలసముద్రం, కాకాజీ కాలనీలోని పలు నర్సింగ్ హోమ్లు, క్లినిక్లను తనిఖీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లా పరిధిలోని అన్ని స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోమ్లను ఏడుగురు ప్రోగ్రాం అధికారులతో కూడిన బృందం సందర్శించిందన్నారు. ప్రభుత్వ అనుమతులు కలిగివున్నారా లేదా అల్లోపతిక్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం పరిధిలో సేవలు అందిస్తున్నది లేనిది, రికార్డులను సైతం పూర్తిగా పరిశీలించనున్నట్లు చెప్పారు.
అనుమతులు లేని క్లినిక్లను, స్కానింగ్ సెంటర్లను గుర్తించి, వాటిని నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ మధన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ఎండీ యాకూబ్పాషా, జిల్లా సర్వేలైన్స్ అధికారి శ్రీకృష్ణారావు, డీఐవో డాక్టర్ గీతాలక్ష్మి, డీటీసీవో డాక్టర్ పీ మల్లికార్జున్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ పీ ఉమాశ్రీ, జిల్లా మాస్ మీడియా అధికారి వీ అశోక్రెడ్డి, ప్రసన్నకుమార్, చ్రందశేఖర్, మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.