గీసుగొండ/మట్టెవాడ/కాశీబుగ్గ/గిర్మాజీపేట, సెప్టెంబర్ 8: గణపతి నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని ఆర్డీవో మహేందర్జీ కోరారు. గీసుగొండ మండలం గొర్రెకుంట కట్టమల్లన్న చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను గురువారం ఆయన మామునూరు ఏసీపీ నరేశ్కుమార్తో కలిసి పరిశీలించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు ఆర్డీవో తెలిపారు. ఏసీపీ మాట్లాడుతూ నిమజ్జనానికి డీజేలు నిషేధమన్నారు. వారి వెంట తహసీల్దార్ విశ్వనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకన్న, సందీప్కుమార్, కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ఉన్నారు.
అలాగే, వరంగల్ ఏసీపీ గిరికుమార్ కలకోట మట్టెవాడ పోలీస్స్టేషన్లో వినాయక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వినాయక నిమజ్జన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఊరేగింపు సమయంలో డీజేలు వాడొద్దన్నారు. దేశాయిపేట ప్రాంతంలోని చిన్నవడ్డేపల్లి చెరువును అడిషనల్ కలెక్టర్ కోట శ్రీవత్సవ, ఆర్డీవో మహేందర్జీ, రెవెన్యూ సిబ్బంది సందర్శించారు. శుక్రవారం జరిగే గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. కోటి చెరువు వద్ద విద్యుద్దీపాలు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, క్రేన్లు ఏర్పాటు చేశారు. గణేశ్ నిమజ్జనానికి డీజేకు అనుమతి లేదని ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ సీఐ డీ మల్లేశ్ తెలిపారు. గీసుగొండ పోలీస్ష్టేషన్లో మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ కౌన్సెలింగ్ ఇచ్చారు. గణపతి నిమజ్జనాలకు డీజేలు పెడితే సీజ్ చేయడంతోపాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రౌడీషీటర్లు గొడవలకు వెళ్లొద్దన్నారు. డీజేలు పెట్టొద్దని సంగెం ఎస్సై పెండ్యాల దేవేందర్ కోరారు. ఎల్గూర్ చెరువు వద్ద ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
నేడు గంగమ్మ చెంతకు గణపయ్యలు
నర్సంపేట రూరల్: గణపతి నవరాత్రోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం గంగమ్మ చెంతకు గణపయ్యలు చేరనున్నాయి. నర్సంపేట డివిజన్లోని ఆరు మండాలాలతోపాటు పట్టణంలో ఈ దఫా 1090కి పైగా గణపతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారిలోని దామెర చెరువులో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వినాయకులను దామెర చెరువులో నిమజ్జనం చేయనున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇప్పటికే పరిశీలించారు. దామెర చెరువు వద్ద మున్సిపల్ సిబ్బంది బారికేడ్లు, లైటింగ్స్ ఏర్పాటు చేశారు. క్రేన్లు, తెప్పలను కూడా అందుబాటులో ఉంచారు.
చెరువుల వద్ద ఏర్పాట్లు పూర్తి
కరీమాబాద్: గణేశ్ నిమజ్జనం కోసం అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని ఉర్సు రంగసముద్రం చెరువు, బెస్తం చెరువు వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 500 నుంచి 600 విగ్రహాలు నిమజ్జనం జరిగే ఉర్సు చెరువు వద్ద, 150 నుంచి 200 విగ్రహాలు నిమజ్జనం జరిగే బెస్తం చెరువు వద్ద అధికారులు అంతేస్థాయిలో ఏర్పాట్లు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఉర్సు బైపాస్ రోడ్డు నుంచి ఉర్సు చెరువు వరకు విద్యుత్ దీపాలు అమర్చారు. అండర్రైల్వేగేట్ ప్రాంతంలో గొడవలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మామునూరు సీఐ క్రాంతికుమార్ రమేశ్ మాట్లాడుతూ గణపతి నిమజ్జనానికి బెస్తం చెరువు వద్దకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా ఊరేగింపు చేపట్టాలన్నారు.