వరంగల్, అక్టోబర్ 4: భద్రకాళి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9వరోజు మంగళవారం మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చారు. తెల్లవారు జామున నిత్యాహ్నికం, చతుస్థానర్చన అనంతరం అర్చకులు అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. ఉదయం వృద్ధి హోమం, నవరాత్రి యాగ మహా పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం శంభహాదుర్గార్చన, సర్వభూపాల వాహన సేవ చేశారు.
అమ్మవారిని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో శేషు ఘనంగా స్వాగతం పలికారు. మహా మండపంలో మహాశీర్వచనం ఇచ్చి, అమ్మవారి శేషవస్ర్తాలు, ప్రసాదాలు అందజేశారు.
కరీమాబాద్ : అండర్రైల్వేగేట్ ప్రాంతం 32వ డివిజన్ ఎస్ఆర్ఆర్తోటలోని కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. మంగళవారం మహిషాసురమర్దిని అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. పూజారి ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పంచామృతాలతో అమ్మవారి ప్రతిమకు అభిషేకాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శంకరమఠంలో..
పోచమ్మమైదాన్ : వరంగల్ శ్రీనివాస కాలనీలోని శంకరమఠంలో చండీహోమాన్ని మంగళవారం నిర్వహించారు. హోమంలో పెద్ది శ్రీనాథ్-హేమలత దంపతులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదానం, సాయంత్రం ఆలయంలో లక్ష కుంకుమార్చన నిర్వహించినట్లు పూజారి సంగమేశ్వర జోషి తెలిపారు.
గిర్మాజీపేట : వరంగల్లోని పలు దేవాలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. మంగళవారం రామన్నపేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో చండీహోమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు బ్రహ్మదేవర ఆనందరావు తెలిపారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి గన్ను రవికాంత్, కోశాధికారి తోట సోమేశ్వర్, ఉపాధ్యక్షులు పబ్బా సాంబమూర్తి, యాదా కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి పిన్నా ఈశ్వర్, టీ రాజేశ్వరరావు, కార్యవర్గసభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
అలాగే స్టేషన్రోడ్డులోని ఆకారపు వారి గుడిలో రామలింగేశ్వర ఆలయ పూజారి శివకుమార్శర్మ, తనుగుల రత్నాకర్ అమ్మవారిని మహిషాసురమర్దిని రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం భక్తులకు తీర్ధ, ప్రసాదాలు నిర్వహించారు. పిన్నవారివీధిలోని వాసవీక్లబ్ కార్యాలయ ఆవరణలో దేవినవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అధ్యక్షుడు ఎం జయకుమార్, సభ్యులు ప్రజలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి అక్కినపల్లి నిర్మల, కోశాధికారి ఎం జ్యోతి, ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి పసుపతి, ఆర్సీ తోట వైద్యనాథ్, సభ్యులు రవ్వ సురేశ్, నూక సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్ : మండల వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం దుర్గామాత అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలోని దుర్గామాత విగ్రహం వద్ద భక్తులు కుంకుమ పూజ నిర్వహించారు. అదేవిధంగా ముగ్దుంపురం, ద్వారకపేట, మాదన్నపేట, లక్నెపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. పిల్లాపాపలు, పాడి పంటలు బాగుండాలని ఈసందర్భంగా దుర్గామాతను భక్తులు వేడుకున్నారు.
పోచమ్మమైదాన్ : ములుగు రోడ్డులోని వాసవీమాత ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా వాసవీ మాతను రాజ రాజేశ్వరీ దేవిగా అలంకరించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీహోమం, భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్, కర్నాటి శ్రీనివాస్ విజయలక్ష్మి, బన్న రమాదేవీ సుధాకర్, రామోజు చంద్రకళ, గిరిబాబు దంపతులు పాల్గొన్నారు.
కాశీవిశ్వేశ్వస్వామి ఆలయంలో..
కాశీబుగ్గ, అక్టోబర్ 4 : నగరంలోని కాశీవిశ్వేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం చండీహోమం నిర్వహించారు. అలాగే మహాన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఉయం నుంచి భక్తులతో దేవాయల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వడిచెర్ల సదానందం, డాక్టర్ గొనే జగదీశ్వర్, మండల శ్రీరాములు, మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, గుండేటి కృష్ణమూర్తి, ఓరుగంటి కొమురయ్య, బొమ్మగాని క్రిష్ణమూర్తి, పాశికంటి రమేష్, కుంటపెల్లి ఉమాశంకర్, ఓంకారేశ్వర్ పాల్గొన్నారు.
కనకదుర్గ దేవాలయంలో…
నగరంలోని 19వ డివిజన్ నర్సంపేట రోడ్డులోని కనకదుర్గ దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాన్నదాన కార్యక్రమంను చైర్మన్ మీసాల ప్రకాశ్ చేశారు. అలాగే కనకదుర్గ అమ్మవారికి గోవింద్సింగ్, శ్రీవిద్య, రంజిత్సింగ్ ఖడ్గం బహూకరించారు.
పర్వతగిరి : మండల కేంద్రంలో మంగళవారం చండీ హోమం కార్యక్రమం అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చండీ హోమం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, ఉపసర్పంచ్ రంగు జనార్దన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ఉంటే అంతా మంచి జరుగుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చండీ హోమం వేడుకలను తిలకించారు.
నర్సంపేట : మండల కేంద్రంలో ఘనంగా దేవీ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పలు కూడళ్లలో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్య పూజలు చేశారు. వాసవీ మాత ఆలయంలోనూ అమ్మవారిని కొలుస్తున్నారు. నవరాత్రోత్సవాల సందర్భంగా హోమాలు నిర్వహించి అన్నదానం చేశారు.