వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 29 : అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాలలో నూతన పడకలతో మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులను గురువారం ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్సీ సారయ్య తన నిధుల నుంచి మంజూరు చేసిన సుమారు రూ.44 లక్షలతో వీటిని సమకూర్చారు. వైద్యశాల అవసరాల కోసం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను కలెక్టర్ గోపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదన్నారు. వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్గా మార్చేందుకు సుమారు రూ.1,100 కోట్ల వ్యయంతో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎంజీఎం దవాఖానకు అధునాతన యంత్ర పరికరాలను సమకూర్చిందన్నారు. అనంతరం వైద్యశాలలో సేవలు పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు.
ఎస్సీ హాస్టల్ భవనం పరిశీలన..
పోచమ్మమైదాన్ : వరంగల్ దేశాయిపేటలోని ఎస్సీ హాస్టల్ పాత భవనాన్ని కలెక్టర్ బీ గోపి గురువారం పరిశీలించారు. భవనాన్ని చాలా సంవత్సరాల నుంచి ఉపయోగించకపోవడంతో నిరుపయోగంగా మారింది. గతంలో ఇందులో ఉన్న హాస్టల్ను హనుమకొండకు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పరిశీలించారు. భవనానికి త్వరితగతిన మరమ్మతు పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వరంగల్ తహసీల్దార్ సత్యపాల్రెడ్డి, కార్పొరేటర్ కావటి కవిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.