వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 29: కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో త్వరలో పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామని ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. హాస్పిటల్లో గురువారం వరల్డ్ హార్ట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్రావు, కార్డియాలజీ విభాగం వైద్యులు కేక్ కట్ చేశారు.
అనంతరం గుండె జబ్బులు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. ఈ సంఖ్యను తగ్గించడానికి రోగులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
గడిచిన 10 నెలల కాలంలో కార్డియాలజీ విభాగంలో 2,135 మందికి సేవలు అందించామని, ప్రస్తుతం 53 మంది ఇన్పేషంట్ సేవలు పొందుతున్నారని అన్నారు. ప్రతి నెల సుమారు 800 మందికి ఆంజియోగ్రామ్ సేవలు, 300 మందికి స్టెంట్స్, 700 మందికి టూడీ ఈకో, 50 మందికి స్వల్ప శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సూపర్స్సెషాలిటీ హాస్పటల్లో వరల్డ్ హార్ట్ డే రోజున మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేయడం వైద్య బృందంలో ఉత్సాహాన్ని నింపిందని అన్నారు.
హైదరాబాద్లోని ఉస్మానియా, నిమ్స్ హాస్పిటల్స్ తరహాలోనే వరంగల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలను అందించడానికి ప్రభుత్వం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఉన్నతాధికారులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. ప్రస్తుతం ఐపీ సేవలు పొందుతున్న వారికి సైతం సమయానుకూలంగా శస్త్రచికిత్సలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు సైతం నిర్వహించడానికి కృషి చేస్తామని వవరించారు. కార్యక్రమంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ మమతారెడ్డి, వైద్యులు అల్లాడి సృజన్, బత్తిని రిషిత్, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ నర్సింగరావు, ఆర్ఎంవో హీన, శ్రీనివాస్, నర్సింగ్ సూపరింటెండెంట్ సుశీల పాల్గొన్నారు.