ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల చూపంతా మొహాలీ వైపే. ధర్మశాలలో భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ముగిసిందో లేదో.. మోడర్న్ క్రికెట్ లెజెండ్లలో ఒకడైన కోహ్లీ 100వ టెస్టుకు మొహాలీ ముస్తాబైంది. లంకతో జరిగే తొలి టెస్టే కోహ్లీకి 100వది. దీంతో అందరూ ఈ మ్యాచ్పై ఆసక్తి పెంచుకున్నారు. ఈ క్రమంలో టీమిండియా లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
రెండేళ్లుగా సెంచరీలు లేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. వందో టెస్టులో సెంచరీ చేస్తే చూడాలనుందని, ఆ సత్తా కోహ్లీకి ఉందని సన్నీ చెప్పాడు. ‘‘వంద టెస్టులు ఆడటమే అద్భుతమైన ఫీట్. అలాంటిది ఆ టెస్టులో సెంచరీ చేస్తే ఆ అనుభూతి మరో రేంజ్లో ఉంటుంది. అందరూ అలా చేయలేరు. నాకు తెలిసి కోలిన్ కౌడ్రీ చేశాడు. క్రికెట్లో వంద టెస్టులు ఆడిన తొలి ఆటగాడు అతనే అనుకుంటా. ఆ తర్వాత జావెద్ మియాందాద్ చేశాడు. అలెక్స్ స్టివార్ట్ కూడా చేసినట్లున్నాడు’’ అని చెప్పాడు.
ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో తొమ్మిది మంది ఆటగాళ్లు మాత్రమే వందో టెస్టులో సెంచరీ చేశారు. వీరిలో కూడా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ ఒక్కడే వందో టెస్టు రెండు ఇన్నింగ్సుల్లోనూ రెండు సెంచరీలు సాధించాడు. కోహ్లీ వందో టెస్టు గురించి మాట్లాడిన సునీల్ గవాస్కర్.. తన వందో టెస్టును గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచులో సన్నీ 48 పరుగులు చేసి అవుటయ్యాడు. ‘‘నేను స్క్వేర్ లెగ్ వైపు హాఫ్ వాలీ ఆడా. అప్పుడు నేను 48 పరుగులతో ఉన్నా. అది చాలా ఈజీ క్యాచ్’’ అని ఆ జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.