వచ్చే టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు టీమిండియా నయా ఫినిషర్ దినేష్ కార్తీక్ సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. భారత జట్టులో రిషభ్ పంత్, దినేష్ కార్తీక్ మధ్య వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం పోటీ ఉంది. ఈ క్రమంలోనే ఆసియా కప్లో పంత్ను ఆడించినా అతను ప్రభావం చూపలేకపోయాడు.
ఈ కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచుల్లోనూ దినేష్ కార్తీక్ను ఆడించారు. కానీ అతను ఎక్కువ బ్యాటింగ్ చేయలేకపోయాడు. రెండో మ్యాచులో ఆడిన పంత్కు కూడా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీనిపై సిరీస్ విజయం తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. ప్రపంచకప్ ప్రారంభమయ్యేలోపు దినేష్ కార్తీక్కు ఆడే అవకాశాలు మరిన్ని కల్పించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
‘ఈ సిరీస్లో ఆడినప్పటికీ మూడు బంతులేమో ఆడాడు. అలా కాకుండా మిడిల్లో తను మరింత ఆడేలా చూడాలని అనుకుంటున్నాం’ అని వివరించాడు. పంత్ కూడా మరింత ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. వీళ్లిదర్నీ జట్టులో సరిగ్గా మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తామని, లెఫ్ట్ హ్యాండర్ అవసరమైతే లెఫ్ట్ హ్యాండర్ను.. రైట్ హ్యాండర్ అవసరం అయితే రైట్ హ్యాండరన్ను జట్టులోకి తీసుకుంటామని చెప్పాడు. జట్టులో కేవలం 11 మందే ఆడగలరని, కాబట్టి అవసరమైన మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశాడు.