వనపర్తి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : నియోజకవర్గంలో అన్నదాతల ఆత్మీయ సమ్మేళనాన్ని అద్భుతంగా నిర్వహించి నూతన ఒరవడికి శ్రీకారం చుడుదామని, రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచేలా సమిష్టి కృషితో ముందుకెళ్దామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మంగళవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు సందేశమిచ్చారు. ప్లీనరీ సమావేశానికి రాలేకపోయిన పార్టీ శ్రేణులు సహృదయంతో అర్థం చేసుకోవాలన్నారు. అధిష్టానమే పాస్లు జారీచేసిందని, గుండెలనిండా అభిమానం ఉన్న చాలా మంది రాలేకపోయారని, మన పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తుందన్న విషయాన్ని గమనించాలన్నారు. వనప ర్తి జిల్లాలో 37 రైతువేదికలు పూర్తయ్యాయని, ప్రతి రైతువేదికలో 400 మంది రైతులతో సమ్మేళనాలు జరపాలని సూచించారు. జెడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీ టీసీలు, వ్యవసాయాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఒకేరోజు ఏకకాలంలో సమ్మేళనాలు నిర్వహించి విజయవంతం చేసేందుకు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ని యోజకవర్గ స్థాయిలో దాదాపు 15 వేల మంది రైతుల తో ఆత్మీయ సమ్మేళనం త్వరలో నిర్వహించుకుందామ ని చెప్పారు. వచ్చే యాసంగి సాగుకుగానూ కాలువల ద్వారా నీటిని తీసుకెళ్లి ప్రజాప్రతినిధులు చెరువులు, కుంటలు నింపుకోవాలన్నారు. వేసవిలో కాలువలకు రో జూ నీటిని వదలాలని సూచించారు. వనపర్తి జిల్లా కేం ద్రంలో ఈదుల చెరువును నింపి అక్కడి నుంచి శ్రీనివాసాపురం, నల్లచెరువుతోపాటు పెద్దగూడెంలోని ఖాన్చెరువును నింపేందుకు దృష్టి సారించాలన్నారు. రాజపేట హనుమాన్ల, తాడిపర్తి చెరువు నుంచి చిట్యాల, అక్కడి నుంచి జగత్పల్లి చెరువు మీదుగా మిగతా చె రువులను నింపుకోవాలన్నారు. నవంబర్ 10న ఆర్ అండ్బీ శాఖ మంత్రి చేతుల మీదుగా క్యాంపు కార్యాల యం, 11న రైతువేదికలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నవంబర్ 15 తర్వాత సీఎం కేసీఆర్ పర్యటన ఉండనున్నదని.. మార్కెట్, డబుల్ బెడ్రూం ఇండ్లు, కలెక్టరేట్, నూతన కార్యాలయాలు, పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. వచ్చే నెల వరంగల్లో జరిగే విజయగర్జనకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని వాయిదా వేసి దీపావళి తర్వాత నిర్వహించేలా తేదీలను వెల్లడిస్తామని మంత్రి చెప్పారు.