చెన్నై : తన పిల్లలకు న్యాయం దక్కేందుకే సీఎం పినరయి విజయన్పై పోటీ చేస్తున్నట్లు వలయార్ బాధితుల తల్లి పేర్కొంది. కేరళ అసెంబ్లీకి 6 ఏప్రిల్,2021న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ధర్మాదం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. కాగా పినరయికి వ్యతిరేకంగా వలయార్ బాధితుల తల్లి ఈ ఎన్నికల్లో పోటీచేస్తుంది. 2017లో వలయార్లో 13 ఏళ్లు, 9 ఏళ్ల బాలికలు ఇరువురు అత్యాచారానికి గురై హత్యకు గురయ్యారు. త్రిసూర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం బాధితుల తల్లి మాట్లాడుతూ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. సంఘ్ పరివార్ మద్దతు అవసరం లేదంది. తన పిల్లలకు న్యాయం దక్కాలనే ఉద్దేశ్యంతోనే ఎన్నికల పోటీలో దిగుతున్నట్లు చెప్పారు.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సోజన్పై చర్యలకు ఆమె డిమాండ్ చేశారు. సోజన్ దర్యాప్తును అడ్డుకోవడంతో పాటు తన పిల్లలు చనిపోయిన తర్వాత కూడా వారికి న్యాయం నిరాకరించారన్నారు. ఆందోళన కోసం తనను వీధుల్లోకి నెట్టారన్నారు. తనలాంటి పేద ప్రజలకు న్యాయం నిరాకరించే పోలీసు సిబ్బంది చాలామంది ఉన్నారన్నారు. నిశ్శబ్దంగా బాధపడుతున్న తనలాంటి వారికి న్యాయం దక్కాలనే ఉద్దేశ్యంతోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా బాధితురాలు ఇటీవలే గుండు చేయించుకుంది. జనవరి 26 నుంచి పాలక్కడ్లో సత్యాగ్రహాన్ని పాటిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.