న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇవాళ జరిగిన ఎన్నికలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓటేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆమె ఓటేశారు. ఆ తర్వాత మీడియా వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. ఈ సందర్భం కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నట్లు సోనియా వెల్లడించారు. సోనియాతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కూడా ఇవాళ ఏఐసీసీ ఆఫీసులోనే ఓటేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే, థరూర్ మధ్య పోటీ సాగుతున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా అతి సుదీర్ఘకాలం చేశారు. 1998 నుంచి 2017 వరకు ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఆ తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు ఆమే ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వారు .. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానున్నారు.
అధ్యక్ష పోరు స్నేహపూర్వకంగా సాగుతున్నట్లు శశిథరూర్ తెలిపారు. కానీ చాలా టఫ్గా పోటీ నడుస్తున్నట్లు ఆయన తెలిపారు. సంస్థాగత ఎన్నికల్లో ఏ వ్యక్తి కూడా ఈజీగా గెలవలేరన్నారు. తిరువనంతపురంలో ఉన్న ఇందిరా భవన్లోని కేరళ కాంగ్రెస్ కమిటీ ఆఫీసులో థరూర్ ఓటేశారు.