హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఏడాదికి నాలుగు సార్లు ఓటరుగా నమోదుకు దేశ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకుగానూ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కేంద్రం సవరించింది. డూప్లికేట్ ఓటర్ల గుర్తింపునకు ఆధార్ను ఉపయోగించటం (ఐచ్చికం) కోసం ప్రజాప్రాతినిధ్య చట్టం-1950కు సవరణలు చేసింది. ఈ సవరణ 2022 ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. దీని ప్రకారం.. ఏడాదిలో 3 నెలలకు ఒకసారి జనవరి1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్1 నాటికి 18 ఏండ్లు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
ఆధార్ వివరాలు అందించాలి
ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవాళ్లంతా తమ ఆధార్ వివరాలను లేదా ఫారం-6బీలో ఈసీఐ సూచించిన 11 పత్రాలలో ఏదైనా ఒకదాన్ని అందించాలి. క్లెయిమ్లు, అభ్యంతరాలకు తాజాగా సవరించిన ఫారం-6, ఫారం-7, ఫారం-8లో ధ్రువీకరణ కలిపి దరఖాస్తును అందజేయాలి.