సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ముసాయిదా ఓటరు జాబితాలో మార్పులు చేర్పులతో పాటు నూతన ఓటరు నమోదుకు మంగళవారంతో గడువు ముగియనున్నది. 2021 సంవత్సరానికి చెందిన ముసాయిదా ఓటరు జాబితాను భారత ఎన్నికల సంఘం నవంబర్ 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో పేరు, అడ్రస్ తొలగింపు లాంటి మార్పులు చేర్పులు చేసుకునేందుకు మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారు కూడా ముందుగానే ఓటరుగా నమోదు చేసుకోవచ్చని.. ఇందుకోసం నియోజకవర్గ ఈఆర్ఓ (డిప్యూటీ కమిషనర్ కార్యాలయం)కు కానీ, www.nvsp.in, ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరవాసులను కోరారు.