న్యూఢిల్లీ : కరోనా వైరస్ థర్డ్ వేవ్ భారీ మరణాలు లేకుండా ముగుస్తుందనే సంకేతాలు ఊరట ఇస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున చేపట్టడంతో ఒమిక్రాన్ వేగంగా ప్రబలినా మనం దీటుగా పోరాడగలిగామని నిపుణులు చెబుతున్నారు. ఇక కరోనా వ్యాక్సినేషన్ కొందరు రోగుల్లో మిశ్రమ ఫలితాలను కనబరిచిన క్రమంలో సన్షైన్ విటమిన్గా పేరొందిన విటమిన్ డీని మనం అధికంగా తీసుకోవాలని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎముకలు, దంతపుష్టికి ఉపకరించే ఈ కీలక విటమిన్ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.
విటమిన్ డీ లెవెల్స్ మెరుగ్గా ఉంటే కొవిడ్ వ్యాక్సినేషన్ సామర్ధ్యంపైనా అది సానుకూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. విటమిన్ డీ తగినంతగా లేనివారిలో కొవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డీ మెండుగా ఉండే నట్స్, పుట్టగొడుగులు, పాలు, గుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, ట్యూనా, సాల్మన్ చేపలు, యానిమల్ లివర్, స్విస్ ఛీజ్ వంటి ఆహార పదార్ధాలను అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఆహార పదార్ధాలను తీసుకోవడంతో పాటు నిత్యం వ్యాయామం చేయడం, ఎక్కువగా గుంపుల్లో తిరగడం అవాయిడ్ చేయాలని చెబుతున్నారు.
ఇక కరోనా బారినపడి మరణిస్తున్న వారిలో అత్యధికులు టీకా తీసుకోనివారేనని, సకాలంలో టీకా తీసుకోవడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుకునేందుకు విటమిన్ డీ అధికంగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. విటమిన్ డీ లోపిస్తే ఇమ్యూనిటీ తగ్గడంతో పాటు ఎముకల క్షీణత, కండరాల నొప్పులు, తీవ్ర అలసట, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.