అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ చెంత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజు అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన టీటీడీ అధికారులకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. రేపు దసరా పండుగ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముండడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూలా నక్షత్రం సందర్భంగా నిన్న రెండులక్షల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పటి వరకూ ఎనిమిది రోజుల్లో ఎనిమిది నుంచి పది లక్షల మంది భక్తుల అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వివరించారు. రేపటితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.