న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ కంపెనీకి, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. విశాఖ స్టీల్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఈక్విటీ లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం లోక్సభలో వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ పై విధంగా అన్నారు. విశాఖ స్టీల్స్లో వందశాతం పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పాదకత సామర్థ్యం పెంచడానికే ప్రైవేటీకరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. భాగస్వాములు, ఉద్యోగులు.. విశాఖ స్టీల్స్లో షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం సంపాదించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.