తిరుమల : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 20న వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వ్రతాన్ని ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఈ టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. 20న ఉదయం అమ్మవారి మూలవరులకు, ఉత్సవరులకు ఏకాంతంగా అభిషేకం చేయనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శ్రీకృష్ణ ముఖ మండపంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా భక్తుల చిరునామాకు పంపడం జరుగుతుందని అధికారులు తెలిపారు. పోస్టల్ చార్జీతో కలిపి ఈ సేవా టికెట్ ధరను రూ.1001గా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా వర్చువల్ టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.