ఢిల్లీ : ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్, ఢిల్లీలో శనివారం వర్చువల్ పోస్టుమార్టం ప్రారంభమైంది. శవపరీక్షను అతి తక్కువ సమయంలో మరింత ప్రభావంతంగా పూర్తిచేయడమే లక్ష్యంగా దీన్ని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ప్రారంభించారు. ఈ నూతన సౌకర్యంపై ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ సుధీర్ గుప్తా మాట్లాడుతూ.. ఇది మృతదేహ గౌరవప్రదమైన నిర్వహణకు ఓ ముందడుగన్నారు. ఇకనుండి పోస్టుమార్టానికి, వివిధ పరిశీలనల నిమిత్తం బాడీని కోయాల్సిన పనిలేదన్నారు. అయితే శరీర అవయవాల పరిస్థితి, వ్యక్తి చావుకు గల కారణాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చంటే ఈ నూతన విధానాన్ని ఉపయోగించి మరింత ముఖ్య సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.
భౌతిక పోస్టుమార్టం కంటే వర్చువల్ పోస్టుమార్టం మెరుగైందన్నారు. ఫిజికల్ ఆటోస్పైలో శవపరీక్షకు 6 గంటల సమయం పడితే అదే వర్చువల్ ఆటోస్పైలో కేవలం ఈ ప్రక్రియంతా పది నిమిషాల్లోనే పూర్తి అవుతుందన్నారు. దహన సంస్కరాలకు, అంత్యక్రియలకు మృతదేహాన్ని తొందరగా అప్పగించే వీలుందన్నారు. ఇమేజింగ్ టెక్నాలజీ విధానంలో వర్చువల్ ఆటోస్పైని చేస్తారన్నారు. సీటీ స్కాన్ మెషిన్ను ఉపయోగించి శరీర భాగాలను పరీక్షించనున్నట్లు తెలిపారు. సీటీ స్కాన్ మెషిన్లో బాడీని ఉంచగానే సెకండ్లలోనే అది 25 వేల ఇమేజీలను తీస్తుందన్నారు. అనంతరం వాటిని నిపుణులు పరిశీలించి మృతికి గల కారణాన్ని తెలపనున్నట్లు గుప్తా పేర్కొన్నారు.