క్రికెట్లో సాధారణంగా ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ల మధ్య, వారి అభిమానుల మధ్య వైరం సహజమే. కానీ భారత జట్టులో మాత్రం విడ్డూరంగా సొంత ఆటగాళ్ల అభిమానుల మధ్యనే అతి పెద్ద వైరం. ఇది ఎంతా పెరిగిందంటే.. ఆ ఆటగాళ్ల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఆ ఆటగాళ్లే టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.
వీళ్లిద్దరూ ఐపీఎల్లో వేరే వేరే జట్లకు ప్రాతనిధ్యం వహిస్తున్నారు. అదే సమయంలో చాలా ఏళ్లుగా ఇద్దరూ కలిసి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. దేశానికి ఎన్నో మరపురాని విజయాలు అందించారు. వీరిద్దరి మధ్య వైరం గురించి ఎప్పుడు మీడియా ప్రశ్నించినా.. అలాంటిదేమీ లేదని, తామిద్దరం మంచి స్నేహితులమని వాళ్లిద్దరూ ఎన్నిసార్లు చెప్పినా ఈ ‘సో కాల్డ్ ఫ్యాన్స్’ మాత్రం ఒప్పుకోలేదు.
ఇప్పటికీ రోహిత్ను కొందరు విరాట్ ఫ్యాన్స్ దుర్భాషలాడుతుంటే.. కొందరు రోహిత్ ఫ్యాన్స్ విరాట్ను తిడుతుంటారు. ఈ అభిమానుల యుద్ధాలు గతేడాది మరో స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే యఏఈ వేదికగా పొట్టి ప్రపంచకప్ జరిగింది. పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో రోహిత్, రాహుల్ ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో ఈ దురద బ్యాచ్ మళ్లీ సోషల్ మీడియాలో మంటలు రెచ్చగొట్టింది.
కోహ్లీ కెప్టెన్సీలో ఏ కప్పూ రాకూడదనే స్వార్థంతోనే కీలకమైన మ్యాచ్లలో రోహిత్ ఆడటం లేదని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత బీసీసీఐ వివాదాస్పద పరిణామాల మధ్య కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లీ వీడ్కోలు చెప్పేశాడు. దీంతో ఇదంతా రోహిత్, కోచ్ ద్రావిడ్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కలిసి చేసిన కుట్ర అని ఈ దురద బ్యాచ్ గొడవ చేసింది. నిజమైన కోహ్లీ అభిమాని కూడా ఇది నిజమేనా? అనుకునేలా ఉందా దుష్ప్రచారం.
తన గురించి, తన స్నేహితుల గురించి ఇంత గొడవ జరుగుతున్నా సరే.. రోహిత్తో తనకేం గొడవలు లేవని కోహ్లీ చెప్తూనే వచ్చాడు. రోహిత్ ఫామ్లో లేని సమయంలో కూడా వెనకేసుకొచ్చాడు. ‘రోహిత్ను పక్కన పెడతారా?’ అని ఒక విలేకరి అడిగితే.. ‘మీరైతే రోహిత్ వంటి ఆటగాడిని పక్కన పెడతారా? మీకు ఇలా ఏదైనా సెన్సేషన్ కావాలంటే ముందే చెప్పండి. నేను కూడా రెడీ అవ్వాలి కదా’ అనడం అప్పట్లో బాగా వైరల్ అయింది.
కోహ్లీ తర్వాత జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ కూడా ఫామ్లో లేని కోహ్లీకి అండగా నిలబడ్డాడు. ‘కోహ్లీ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలుసు. అతను జట్టులో చాలా ముఖ్యమైన వ్యక్తి. ఫామ్ కోల్పోవడం అందరి కెరీర్లో జరుగుతుంది. కోహ్లీ కూడా మళ్లీ మునుపటిలా ఆడతాడు. త్వరలోనే మీరంతా చూస్తారు’ అని ధీమా వ్యక్తం చేశాడు.
The face of world cricket #viratkohli 👑
King Kohli 👑❤️#KingKohli #INDvPAK #kohli #ViratKohli𓃵 #india pic.twitter.com/kVocs4ECIi
— ×͜×ᗪᴀʀκ亗 (@ImRealDark_) October 23, 2022
ఆ తర్వాత ఫామ్ కోసం నెల రోజులు విశ్రాంతి తీసుకొని తిరిగొచ్చాడు. అతను విశ్రాంతి తీసుకునే సమయంలో అండగా నిలిచిన రోహిత్.. జట్టులో కోహ్లీ ఎప్పటికీ నాయకుడేనని కితాబిచ్చాడు. విశ్రాంతి తర్వాత వచ్చిన కోహ్లీకి ‘ప్రెషర్ ఏం లేదు. నీ ఆట నువ్వు ఆడు’ అని మద్దతుగా నిలిచాడు. దీంతో రెచ్చిపోయిన కోహ్లీ మరోసారి ‘రన్ మెషీన్’ పేరును సార్ధకం చేసుకుంటున్నాడు.
ఆసియా కప్లో అద్భుతంగా రాణించిన కోహ్లీ.. తన సెంచరీ కరువును కూడా తీర్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్పై అదిరిపోయే ప్రదర్శనతో తన తొలి టీ20 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ టోర్నీలోనే పాక్పై భారత జట్టు విజయం సాధించినప్పుడు పెవిలియన్కు వెళ్లే మెట్లపై రోహిత్ను మెచ్చుకున్నాడు కోహ్లీ. వీళ్లిద్దరూ చేసుకున్న ఈ విక్టరీ సెలబ్రేషన్ అప్పట్లో తెగ వైరల్ అయింది.
ఆఫ్ఘన్ జట్టుపై కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత అతన్ని రోహిత్ ఇంటర్వ్యూ కూడా చేశాడు. సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూ నెట్టింట అత్యధిక వ్యూస్ సాధించింది కూడా. ఇవేమీ ఈ దురద బ్యాచ్కు పట్టవు. ఇప్పటికీ ఈ ప్లేయర్లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాము సోషల్ మీడియాకు దూరంగా ఉంటామని, అందులో చాలా చెత్త ఉంటుందని రోహిత్ కూడా కొన్ని రోజుల క్రితం తేల్చేశాడు.
It feels like, I’m in 2014-18, watching these two bat together, having moments like these,Rifts and everything seems funny😆
Yesterday it was Federer and Nadal and on one day it will be Rohit and Virat,till then wants to see these moments every single match India plays.#rohirat pic.twitter.com/uVV1eYtljl— Chirag Kasat (@imck27) September 25, 2022
చూస్తుండగానే మరోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వచ్చేసింది. ఆదివారం నాడు పాకిస్తాన్పై భారత్ ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ కోహ్లీ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా పాక్ ఎక్కలేని ఎవరెస్టులా నిలిచాడు. ఓటమి కోరల నుంచి జట్టును కాపాడి, విజయతీరాలకు చేర్చాడు. ఇది చూసిన సగటు అభిమాని గుండె ఆనందంతో వెర్రిగంతులేసింది.
అదే ఆనందంలో తడిసి ముద్దయిన కెప్టెన్ రోహిత్.. మైదానంలోకి ఉరికాడు. కోహ్లీని భుజాలపై ఎత్తుకొని గిరగిరా తిప్పేసి తన ఆనందాన్ని చాటుకున్నాడు. ఇది చూసిన సగటు భారత క్రికెట్ అభిమాని కళ్లు చెమర్చడంలో తప్పేం లేదు. ఈ సోషల్ మీడియా చెత్త కారణంగా నిజంగానే తమ ఐడల్స్ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా? అని ఇంతకాలం అనుమానంతో కొట్టుమిట్టాడిన అభిమానులకు ఈ ఫొటో కనులపండువలా కనిపించింది.
ఇద్దరు లెజెండ్స్ మధ్య ఉన్న ఈ అనుబంధం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ మోడర్న్ గ్రేట్స్పై బురద చల్లే ప్రయత్నం చేసిన దురద జీవుల ముఖంపై కొట్టినట్లయింది. అందుకే మనమంతా భారతీయులం.. మనది టీమిండియా అనే భావనతో ఉండాలని నెటిజన్లు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు.
This team. These two. This moment. 🫶💙#ViratKohli | #INDvPAK | #T20WorldCup pic.twitter.com/IiHf2WW4jK
— Lucknow Super Giants (@LucknowIPL) October 23, 2022