టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. దేశంలో ఎక్కడకు వెళ్లినా కోహ్లీ ఫ్యాన్స్ కనపడతారు. ఇప్పుడు కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా కోహ్లీ హీట్ కనిపిస్తోంది. సౌతాఫ్రికాతో జరిగే తొలి టీ20 మ్యాచ్ కోసం భారత జట్టు ఇక్కడకు చేరుకున్న సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం ఇక్కడ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా ఇక్కడకు వచ్చింది.
ఈ క్రమంలో మ్యాచ్ జరిగే గ్రీన్ఫీల్డ్ క్రికెట్ స్టేడియం ఎదురుగా విరాట్ కోహ్లీ లైఫ్ సైజ్ కటౌట్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. కొత్త సినిమాలు రిలీజైనప్పుడు హీరోలకు పెట్టినట్లు కోహ్లీకి కటౌట్ పెట్టిన ‘ఆల్ కేరళ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్’ (ఏకేవీకేఎఫ్).. దీనికి సంబంధించిన ఫొటోను తమ ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది. దీంతో నెట్టింట ఈ కటౌట్ తెగ వైరల్ అవుతోంది.