మంచిర్యాల : మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో గల తన స్వగృహంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ‘జై జవాన్.. జై కిసాన్’ అనే వారని, మోదీ ప్రభుత్వం ‘నై జవాన్.. నై కిసాన్’ నినాదంతో పనిచేస్తున్నదని ఎద్దేవా చేశారు. అగ్నిపథ్ నిర్ణయంతో దేశ యువత గొంతు నొక్కాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు, మేధావులు, సబ్బండ వర్గాలు స్పందించాలని విప్ కోరారు.
సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరమని బాల్క సుమన్ పేర్కొన్నారు. రైల్వే వ్యవస్థ కేంద్రం ఆధీనంలో ఉన్న విషయం తెలిసి కూడా సిగ్గు లేకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వ ఘటనగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించు కోవాలని కోరారు. గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతీయకుండా, దేశ రక్షణకు పాటుపడాలన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చేది లేదు..చచ్చేది లేదని, 16 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊసేలేదని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు దేశ భద్రతకు పెను ముప్పుగా దాపరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ సంపాదన పెంచేందుకే మోదీ పని చేస్తున్నారని, నిత్యం అదానీ సేవలో తరిస్తున్నారని విమర్శించారు. నేటి సికింద్రాబాద్ ఘటనపై బీజేపీ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, బీజేపీని గద్దె దించేందుకు యువత నడుం బిగించాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు.