హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తిరుమలలో వేంకటేశ్వర స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో బోయినపల్లి వినోద్ కుమార్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి, పట్టువస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసిఆర్ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని, దేశ రాజకీయాల్లో కేసిఆర్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని వినోద్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారన్న వినోద్కుమార్.. దేశ రాజకీయాల్లో కేసీఆర్ మంచి పాత్ర ఉండాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు.
చాలాకాలం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారిని దర్శించుకోలేక పోయానన్నారు. ప్రపంచంలో చాలా దేశాలను నేను సందర్శించానని, అయితే టీటీడీ శుభ్రత కలిగిన దేవస్థానం గొప్పగా ఉందని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే సందర్భంలో, ఉద్యమం సందర్భంలో కేసీఆర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారని, కానుకలు సమర్పించారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.