లక్నో : కరోనా టీకా ఇస్తామంటే తీసుకోని వారెవరైనా ఉంటారా? అందరూ టీకా సెంటర్ల వద్దకు పరుగెడుతారు. కానీ ఈ గ్రామ ప్రజలు మాత్రం కరోనా టీకా తమకొద్దంటూ పారిపోయారు. ఏకంగా సరయూ నదిలో దూకేశారు. ఉత్రప్రదేశ్ బారాబంకిలోని ఓ గ్రామంలోకి ఆరోగ్య శాఖ అధికారులు కరోనా వ్యాక్సినేషన్ కోసం వెళ్లారు. టీకా కోసం రావాల్సిందిగా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రజలు మాత్రం టీకా వేయించుకోకుండా అక్కడ్నుంచి పారిపోయి.. సరయూ నదిలో దూకారు. అది కరోనా టీకా కాదు.. విషపూరితమైన ఇంజెక్షన్ అని ప్రచారం చేయడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురైనట్లు అధికారుల విచారణలో తేలింది. అధికారులు టీకాపై అవగాహన కల్పించిన తర్వాత కేవలం 14 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, మరణాల సంఖ్య పెరుగుతోంది.