కరోనాతో ప్రపంచం విహారం గురించి మర్చిపోయింది. నెలల తరబడి ఇంటిపట్టునే ఉన్నవాళ్లు ఇప్పుడిప్పుడే యాత్రలకు పూనుకుంటున్నారు. గురుగ్రామ్కు చెందిన 35 ఏండ్ల కావ్య సక్సేనా ఒంటరి ప్రయాణానికి సిద్ధమైంది. ఆరు నెలలపాటు సోలోగా ఆరు రాష్ర్టాలు చుట్టిరావాలని బయల్దేరింది. పర్యాటక కేంద్రాలు, తీర్థ స్థలాలు కాకుండా మారుమూల పల్లెల్లో మకాం వేయాలని నిర్ణయించుకుంది.
ఆయా గ్రామాలను తిరిగేస్తూ, అక్కడి ప్రత్యేకతలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో పంచుకుంటున్నది. 2020 సెప్టెంబర్లో మొదలైన ఆమె ప్రయాణం పల్లె అందాలతో, గ్రామీణుల ఆప్యాయతలతో హాయిగా సాగింది. తన ప్రయాణ విశేషాలను ఎప్పటికప్పుడు చిన్న చిన్న డాక్యుమెంటరీలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో కంపెనీలు ఆమెను సంప్రదించాయి. తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాల్సిందిగా కోరాయి.
అలా కావ్య ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా వెహికిల్ పార్ట్నర్గా మారిపోయి ప్రయాణాన్ని కొనసాగించింది. ‘మొదట నేను ఆరు నెలల్లో పశ్చిమ్ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలు తిరగాలనుకున్నా. కానీ, ప్రయాణంలో మార్పుల వల్ల మొత్తం ఎనిమిది నెలలు పట్టింది.
ప్రతి రాష్ట్రంలోని ప్రత్యేక హస్తకళలపై డాక్యుమెంటరీ తీశాను. చేనేత చీరలు, చెక్క బొమ్మలు, బుట్టల అల్లిక, మట్టి పాత్రల తయారీతోపాటు.. పల్లెవాసుల ఆచార వ్యవహారాలు నగరవాసులకు తెలిసేలా వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. మనలో చాలామందికి పల్లెల్లో పరిశుభ్రత తక్కువనే అపోహ ఉంటుంది. నిజానికి వాళ్లు పాటించే స్వచ్ఛత ఇంకెక్కడా కనిపించదు. ఈ చలికాలంలో త్రిపుర, మిజోరాం వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది కావ్య.