పొంగిపొర్లిన వాగులతో రాకపోకలకు అంతరాయం.. వసతి, భోజనం ఏర్పాటు చేసిన సర్పంచ్, నాయకులు
ధారూరు, ఆగస్టు 5 : ధారూరు మండల పరిధిలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని నాగారం-మైలారం మధ్య ఉన్న వాగు వంతెనపై పొంగి పొర్లుతుండడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. వికారాబాద్, ధారూరులలో వివిధ పాఠశాల, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, వికారాబాద్ లో పని చేసుకునే రోజువారి కూలీలు రాత్రి వరకు నీటి ప్రవాహం తగ్గకపోవడంతో మైలారం గ్రామంలోనే ఉండిపోయారు. మార్గ మధ్యలో ఉండిపోయిన 200 మంది విద్యార్థులు, 200 కూలీలకు మైలారం గ్రామ సర్పంచ్ బాబ్యనాయక్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవేందర్ గ్రామనాయకులతో కలిసి వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసి, రాత్రి ఉండడానికి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు.
రాత్రి నిద్రపోవడానికి దుప్పట్లు, బ్లాంకెట్స్ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం విద్యార్థులను తమతమ గ్రామాలకు పంపించారు. మండల పరిధిలోని మోమిన్కలాన్ గ్రామానికి చెందిన విద్యార్థులు పరిగి పట్టణంలోని వివిధ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు మోమిన్ఖుర్థు గ్రామం వద్ద భారీ వర్షానికి వాగు వంతెనపై భారీగా నీరు ప్రవహిస్తుండడంతో మోమిన్ఖుర్థు గ్రామం వద్ద నిలిచిపోయారు. విద్యార్థులకు గ్రామ నాయకులు ప్రభుత్వ పాఠశాల వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. వర్షపు నీరు తగ్గిన తర్వాత విద్యార్థులను వారి గ్రామానికి పంపించారు. రుద్రారం-నాగసముందర్ మధ్య కోట్పల్లి అలుగు వాగు వంతెనపై వరద నీరు భారీగా ప్రవహించింది. రుద్రారం-నాగసముందర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దోర్నాల్-ధారూరుస్టేషన్ గ్రామాల మధ్య ఉన్న వాగు తాత్కాలిక వంతెనపై పొంగిపొర్లుతున్నది. మండల పరిధిలోని బాచారం గ్రామ సమీపంలో గల వాగు తాత్కాలిక వంతెనపై భారీగా నీరు ప్రవహించింది. హరిదాస్పల్లి గ్రామ సమీపంలో వంతెనపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. కురిసిన భారీ వర్షానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న వాగులు కుంటల్లో భారీగా నీరు చేరుకున్నది. కురిసిన వర్షానికి పంట పొలాలు నీటితో నిండిపోయాయి.