కరీంనగర్, సెప్టెంబర్ 14 / హుజూరాబాద్/ తిమ్మాపూర్ రూరల్, సెప్టెంబర్ 14 : ‘దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు’ అన్న మహాత్ముడి కలలు తెలంగాణలో సాకారమయ్యాయి. సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనలు.. విప్లవాత్మక కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారాయి. కొత్త పంచాయతీ రాజ్ చట్టంతో పంచాయతీలకే ప్రతి నెలా నేరుగా నిధులు ఇస్తూ.. పల్లె ప్రగతితో పల్లెలను పట్టణాల తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దారు. పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంప్యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, సంఘాల భవనాలు, మిషన్ భగీరథ, కరెంట్, రోడ్లు, మౌలిక వసతుల కల్పన.. ఇలా ఎన్నో చేపట్టి మన పల్లెలను దేశానికే ఆదర్శంగా నిలిపారు.
ప్రథమ పౌరులకు ఎక్కడా లేని విధంగా 5వేల గౌరవ వేతనాల ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఏలను ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షణ పెంచారు. ఎప్పటికప్పుడు ప్రగతి పరవళ్లు తొక్కించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు. ఫలితంగా కేంద్రం ప్రకటిస్తున్న అవార్డుల్లో మెజారిటీ పల్లెలు మనవే ఉండడం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి అద్దంపడుతున్నవి. ఇలాంటి అభివృద్ధి దేశంలోని ప్రతి ఊళ్లో జరగాలన్నా.. అన్నిరంగాల్లో పల్లె మెరవాలన్నా.. ప్రతి విషయంపై సంపూర్ణ అవగాహన, అనుభవం, గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది అని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. మన రాష్ట్రం తరహాలో దేశం బాగుపడాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు.
దేశంలోని ప్రతి ఊరూ బాగుపడుతంది
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీజీ చెప్పిన మాటలను అక్షరసత్యం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనతోనే గ్రామస్వరాజ్యం సాధ్యమవుతుంది. అందుకు మన పల్లెలే ఆదర్శం. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో మెజారిటీ గ్రామాలు మనవే ఉండడం నిదర్శనం. దేశంలో ఎక్కడా లేని విధంగా పంచాయతీల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ, రాష్ట్రం అంతటా ఒకే కార్యాచరణ అమలయ్యేలా చొరవ చూపుతున్నారు. పట్టణాల తరహాలో గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతిని తెచ్చారు. పల్లె ప్రకృతి వనాలు, మంకీ ఫుడ్ కోర్టులు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంప్యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, సంఘాల భవనాలు, మిషన్ భగీరథ, కరెంట్, రోడ్లు, మౌలిక వసతుల కల్పన.. ఇలా ఎన్నో చేపట్టారు. చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్లు, మొక్కలకు నీళ్లు పట్టేందుకు నీటి ట్యాంకర్, చెత్తను తరలించేందుకు ట్రాలీ, చెత్తను కంపోస్ట్ షెడ్ను తరలించి సేంద్రియ ఎరువుగా మార్చడంలాంటి పనులను ఏ రాష్ట్రంలోనూ చేయడం లేదు. సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టాన్ని ఎలా సాధించారో.. అదే పట్టుదలతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నారు. గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు మన రాష్ర్టానికే పరిమితం కాకుండా జాతీయస్థాయిలో తమ అనుభవాన్ని, చతురతను ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఉన్నది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశానికి మేలు జరుగుతుంది. ప్రతి ఊరూ పట్టణాల తరహాలో మారుతుంది. అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుంది.
– బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచ్, ముత్యంపేట-కొండగట్టు (మల్యాల మండలం)
సగటు జీవికి ఆశాకిరణం కేసీఆర్..
నాయకుడి పరిపాలన తీరును అంచనా వేయడానికి మొదటగా పరిశీలించాల్సింది తాను ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే. ఈ విషయంలో కేసీఆర్ను మించినవారు ఎవరూ లేరు. తనదైన దార్శనికత, ముందు చూపుతో రాష్ట్రంలో ఎన్నో అరుదైన పథకాలను ప్రవేశపెట్టి దేశాన్ని ఆకర్షించారు. ఉద్యమ సమయంలో చెప్పినట్లుగా నీళ్లు, నిధులకు సంబంధించిన అన్నింటినీ సాధించారు. నీళ్ల విషయానికి వస్తే మిషన్ కాకతీయ గ్రామసీమల రూపురేఖలు మార్చింది. రైతులకు, మత్సకారులకు బతుకునిచ్చింది. మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధ జలం అందుతుంది. ఈ రెండు పథకాలు దేశ ప్రజలను ఎంతో ఆకర్షించాయి. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకొని సాగు నీటి ప్రాజెక్టులను పూర్తిచేసి సాగును రెండింతలు చేసిన ఘనత కేసీఆర్దే. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తమ జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయని, తమ జీవన ప్రమాణాల్లో ఊహించని ఎదుగుదల ఉంటుందని ఆకాంక్షించిన ప్రజల నమ్మకాన్ని అనతి కాలంలోనే సీఎం కేసీఆర్ నిజం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసినట్లుగానే దేశాన్ని చక్కదిద్దడం కేసీఆర్కు సాధ్యమే. సగటు జీవితానికి ఆశాకిరణం కేసీఆర్. గుతెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నట్లుగానే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఆయనకు పెద్ద కష్టమేమి కాదు. దేశ భవిష్యత్తుకు సారధిగా కేసీఆర్ నిలిస్తే సగటు జీవికి ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థిల్లో విజన్ ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉంది.
– జక్కుల చంద్రశేఖర్, సర్పంచ్, భూపతిపూర్ (రాయికల్)
యువతకు ఉజ్వల భవిష్యత్తు
దేశ సమగ్రత, యువత భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే. పల్లెలను ప్రగతి బాట పట్టించిన నాయకుడి కోసం దేశ ప్రజానీకం ఎదురుచూస్తున్నది. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశమంతా కోరుకుంటున్నది. రైతు బంధు, రైతుబీమా, నాణ్యమైన ఉచిత విద్యుత్తు దేశంలో రైతులందరికీ అందించే ఏకైక సత్తాగల నాయకుడు మన సీఎం. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వల్ల ఎక్కువ సంఖ్యలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కేసీఆర్ అన్ని రంగాల్లో పెను మార్పులు తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థ, పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు అభివృద్ధివైపు పరుగులు పెడుతున్నాయి. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్లు, క్రీడా మైదానాలు, హరితహారం లాంటి కార్యక్రమాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయనడంలో అందుకు కేంద్రం నుంచి వస్తున్న అవార్డులే నిదర్శనం. దమ్మున్న నాయకుడు దేశరాజకీయాల్లోకి వస్తే దేశం జీడీపీ రెండింతలవుతుంది. ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుపుతారనడంలో సందేహం లేదు.
– గనప శివజ్యోతి, సర్పంచ్, మండెపల్లి (తంగళ్లపల్లి మండలం)
దేశంలో తొందరగా అభివృద్ధి
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళ్తే దేశం తొందరగా అభివృద్ధి చెందుతది. ఎనిమిదేళ్లలో తెలంగాణను ఎట్ల అభివృద్ధి చేసిండో అట్లనే దేశాన్ని అభివృద్ధి చేస్తడని గట్టిగ నమ్ముతున్న. పల్లె ప్రగతి పేరుతోని తెచ్చిన పథకంతో తెలంగాణల గ్రామాలు తొందరగా అభివృద్ధి దిశలో పరుగులు పెడుతున్నయి. గ్రామాలల్ల జ్వరాలు తగ్గినయ్. ఈ సీజన్ల ఎట్ల జ్వరాలు వచ్చేటియి. రెండు మూడేండ్ల నుంచి జ్వరాలు పూర్తిగా తగ్గినయ్. ఇపుడు వేరే రాష్ట్రంల ఎట్ల జ్వరాలొస్తున్నయ్. ఎంత మంది చనిపోతున్నరో మనం చూస్త లేమా. అంతెందుకు తెలంగాణల ప్రభుత్వ దవాఖానలను కేసీఆర్ సార్ ఎట్ల అభివృద్ధి చేసిండు. చిన్న ప్రైమరీ సెంటర్ల సుతం మందులు, గోలీలు ఇస్తున్నరు. ఇసొంటి సౌలతులు ఏ రాష్ట్రంలనన్నా ఉన్నయా? అభివృద్ధి అంటే ఇట్ల ఉండాలని కేసీఆర్ సార్ చేసి చూపించిండు. గతంల గ్రామాల అభివృద్ధి గురించి ఏ సీఎం అయినా పట్టించుకున్నడా. గ్రామాన్ని అభివృద్ధి చేయకపోతే చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతది. ఇసొంటి చట్టాలు ఏ రాష్ట్రంలనన్నా ఉన్నయా. దేశంలోని గ్రామాల అభివృద్ధి ఇలాగే జరగాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. అదే మేమంతా కోరుకుంటున్నం.
– జంగిలి శ్రీలత, సర్పంచ్, కిష్టాపూర్ (రామడుగు మండలం)
దేశ ప్రగతి సాధ్యం..
కేంద్రంలో పరిపాలన చేస్తున్న బీజేపీ రాష్ర్టాల అభివృద్ధిపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దేశ సంపదను రాష్ర్టాలకు వినియోగించడం లేదు. దీంతో రాష్ట్రాల్లో ఎటువంటి అభివృద్ధి లేక, విద్య, వైద్యం, తాగు, సాగు నీరు అందక అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా రాష్ర్టాల ప్రజల జీవన స్థితి గతులను బట్టి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అందుకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా సాయం అందించాలి. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం రాష్ర్టాలను రాష్ర్టాల అభివృద్ధిని పట్టించు కోవడం లేదు. కేంద్రం ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వడం లేదు. సీఎం కేసీఆర్ కేంద్ర నిధులను, రాష్ర్టాలకు ఇచ్చే వాటాను అడుగుతుండడంతో బీజేపీ సర్కారు కక్ష పెంచుకున్నది. మతాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని కుట్ర పన్నుతున్నది. వారి ఆటలు ఇక సాగవు. సీఎం కేసీఆర్ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపితే దేశ సంపదను అన్ని రాష్ర్టాలకు సమానంగా పంచి అభివృద్ధి పథంలో నడిపిస్తారు.
– చెన్నాడి రాజ్యలక్ష్మి సర్పంచ్, కోరెం, బోయినపల్లి మండలం
మన పల్లెలు దేశానికే దిక్సూచి..
సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా మన పల్లెలు నేడు దేశానికే దిక్సూచిగా మారాయి. కొత్త పథకాలతో పేద ప్రజల సంక్షేమానికి భరోసాగా నిలుస్తున్నారు. తెలంగాణ రాక ముందు పల్లెల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు లేకుండే. దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు అని గాంధీ అన్న మాటను కేసీఆర్ ఆచరణలో పెట్టారు. వైకుంఠధామాల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనాలు, సామూహిక మరుగుదొడ్లు, డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, రైతు వేదికలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, బురద రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడం, మారుమూల పల్లెలకు సైతం తారురోడ్డు సౌకర్యం, మండల కేంద్రాలను డబుల్ రోడ్లు, చిన్న గ్రామపంచాయతీల ఏర్పాటు, గ్రామాల్లో స్వచ్ఛత కోసం జీపీలకు ట్రాక్టర్లు సమకూర్చడం, ‘మన ఊరు- మన బడి’ కింద పాఠశాలలను ఆధునీకరించడం, పల్లె ప్రగతి ద్వారా పల్లెల రూపురేఖలే మారిపోయాయి. ఆదర్శ గ్రామాలుగా తయారయ్యాయి. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తే పల్లెలు బాగు పడుతాయి. దేశ ప్రజలందరికీ లాభం జరుగుతుంది. సార్కు మేం సంపూర్ణంగా మద్దతిస్తున్నాం.
– పోతుగంటి రమగౌడ్, సర్పంచ్, నాంసానిపల్లి (ఓదెల)
పేదల బతుకుల్లో వెలుగులు..
స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి దేశం 75 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీ నాయకుల చేతుల్లోనే ఉంది. కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు దేశాన్ని పంచుకొని తిన్నారే తప్ప పేదలకు చేసిందేమీ లేదు. ఇన్నాళ్ల స్వాతంత్య్ర చరిత్రలో పేదలు బతుకలేని స్థితిలోకి వచ్చారు. కేసీఆర్తోనే దేశంలోని పేదల బతుకుల్లో వెలుగులు నిండుతాయి. దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన సేవలు ఎంతో అవసరం. దరిద్రపు గొట్టు బీజేపీని తరిమికొట్టడం కేసీఆర్తోనే సాధ్యం. జాతీయ పార్టీ పెట్టాలనుకోవడం మంచి పరిణామం. పోరాడి తెలంగాణ సాధించడంతో పాటు కేసీఆర్ సీఎం పదవి చేపట్టి దేశ ప్రజలు మెచ్చే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. ప్రజలకు అవసరమయ్యే ప్రతి అంశంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు. కేసీఆర్ నాయకత్వం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్నది. యావత్ తెలంగాణ ప్రజానీకం కేసీఆర్కు అండగా నిలబడాలి. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను కలుపుకొని దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించడం ఖాయం. ప్రస్తుత తరుణంలో సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం.
– కొత్తిరెడ్డి కాంతారెడ్డి, సర్పంచ్, ఎల్బాక (వీణవంక)
పెనుమార్పులే
రాజకీయంగా అపార అనుభవమున్న సీఎం కేసీఆర్తోనే దేశ రాజకీయాల్లోకి వెళితే పెను మార్పులు జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి చాలా అవసరం ఉంది. దేశ ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలంటే సరైన నాయకత్వం ఉండాలి. సీఎం కేసీఆర్ ఇప్పటికే రాష్ర్టాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేశారు. అనేక పథకాలు, కార్యక్రమాలతో సబ్బండవర్గాలకు అండగా నిలిచారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచిగా నిలుపగా, జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారు. రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారం పొందేందుకు కులం మతం పేరిట ఘర్షణలు రేపుతున్నారు. యువతలో చెడు ఆలోచనలు రేకెత్తించి విష బీజాలు నాటిస్తున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలోని ఒక్క గ్రామానికైనా వచ్చిండా..? పార్లమెంట్ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా తెలిసేనా..? ఈ విషయంపై యువత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే రెండు సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏం సాధించింది? దేశ ప్రజలకు ఏం ఒరగబెట్టింది? ఇలాంటి మతతత్వ బీజేపీతో దేశానికి చాలా ప్రమాదం. గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి సమయంలో రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం అవసరం. ఆయనతోనే దేశ అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ ఎలాగైతే ఊహించని ప్రగతి సాధించిందో దేశ ప్రగతి కూడా పరుగులు పెట్టడడం ఖాయం.
– గుంటి లతశ్రీ సర్పంచ్, బోయినపల్లి (రాజన్న సిరిసిల్ల జిల్లా)
విజన్ ఉన్న నాయకుడు
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడి సేవలు ఎంతగానో అవసరం. పాలన రాదన్న వారిచేత.. అభివృద్ధి అద్భుతం అనిపించిన గొప్ప నేత కేసీఆర్. తెలంగాణను ఎనిమిదేళ్లలో ఎంతగానో గొప్పగా తీర్చిదిద్దారు. ఇప్పుడు దేశ స్థితిగతులు మార్చే సమయం వచ్చింది. ఆయన ఆలోచనలు, సంస్కరణలు, పథకాలు, సంక్షేమం అన్ని విషయాల్లో అపరచాణక్యుడిగా వ్యవహరించే ఆయన జాతీయస్థాయిలో పార్టీ పెడితే అద్భుత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో నంబర్ వన్ పాలన నడుస్తున్నది. ఇలాంటి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోని పేదలు, అన్ని వర్గాలవారికి ఎంతగానో అవసరం ఉన్నది. రాజకీయంగా చూసుకున్నా ఇంత పరిపక్వత ఉన్న నాయకుడు దేశంలో ఎక్కడా దొరకడు. జాతీయ స్థాయిలో ప్రజలు పరిపాలనలో మార్పు కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ సార్ జాతీయ పార్టీ కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.
– రావుల రమేశ్, సర్పంచ్, నుస్తులాపూర్ (తిమ్మాపూర్ రూరల్)
దేశ భవిష్యత్ను తీర్చిదిద్దే నాయకుడు
దేశంలోని పేదలకు సంక్షేమ పథకాలు అందడంలేదు. పెరిగిన ధరలతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మంచి అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి దేశ రాజకీయాల్లోకి రావాలి. విజన్ ఉన్న నాయకుడితో దేశంలో తప్పకుండా మార్పు వస్తుంది. అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొవచ్చే సత్తా ఒక్క కేసీఆర్కే ఉంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. పట్టుబట్టి రాష్ర్టాన్ని సాధించి గడిచిన ఎనిమిదేండ్లలో అద్భుతంగా తీర్చిదిద్దారు. అనతి కాలంలో రాష్ట్రం ఒక స్వర్ణయుగంగా మారింది. దేశంలో ఎక్కడా లేని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో దేశ ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నరు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాణిస్తే దేశభవిష్యత్ను తీర్చిదిద్దుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. రైతులతో పాటు, అన్నివర్గాల ప్రజలకు ఎంతో లాభం చేకూరుతుంది.
– బండ రవీందర్రెడ్డి, సర్పంచ్, లక్ష్మీపురం (కాల్వశ్రీరాంపూర్)
జాతీయ పార్టీ పెట్టాల్సిందే
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాల్సిందే. రాదనుకున్న తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. గత ప్రభుత్వాల హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కరెంట్ లేక, సాగు నీరు రాక దుర్భరంగా బతికిన రైతాంగాన్ని గట్టెక్కించి, వ్యవసాయాన్ని పండుగ చేసిన గొప్ప నాయకుడు. సాధించుకున్న తెలంగాణలో రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇస్తండు. రైతులకు రైతుబంధు, బీమా అమలు చేస్తండు. గతంలో చిన్న గ్రామాలు, హామ్లెట్ గ్రామాలు వెనుకబాటుకు గురై అభివృద్ధికి నోచుకోలేదు. 500 జనాభా పైబడిన గ్రామాలన్నింటినీ సీఎం కేసీఆర్ సారే నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిండు. పల్లెల బాగు కోసం పల్లెప్రగతిని ప్రవేశపెట్టి గ్రామాలను అభివృద్ధి వైపు మళ్లించిండు. హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. ఇప్పుడు పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. గ్రామాలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. కేసీఆర్ సార్ రాష్ట్ర సీఎంగా ఉంటేనే ఇన్ని పథకాలను అమలు చేస్తున్నడు. జాతీయ రాజకీయాల్లో రాణిస్తే దేశం మొత్తం గొప్పగా అభివృద్ధి చెందుతుంది.
– ఆకుల చిరంజీవి, సర్పంచ్, అంకంపల్లి (కాల్వశ్రీరాంపూర్)
కేసీఆర్ రావాలి.. ఫలాలు అందాలి..
అతి స్వల్పకాలంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిన దార్శనికుడు కేసీఆర్. అలాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లోకి రావడం అవసరమే. సమైక్య పాలనలో పల్లెలన్నీ ఆగమయ్యాయి. కరెంటు లేక అంధకారంలో మగ్గాయి. తండాలకు కనీస తాగునీరు లేక తల్లడిల్లాయి. అలాంటి పరిస్థితిలో ఉద్యమాలతో సాధించిన తెలంగాణలో తాగు, సాగు నీటి కరెంటు గోసలు తీర్చిన నాయకుడు కేసీఆర్. ఆడబిడ్డ పెళ్లి చేయలేని తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో వివాహం చేసి, ఇల్లు కట్టించి పెద్దన్నగా ఆదుకున్నాడు. ప్రపంచమే గర్వించేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాడు. మిషన్ కాకతీయ పథకంతో ఇంటింటికీ తాగునీరందించాడు. తండాలను పంచాయతీలుగా మార్చాడు. తెలంగాణలోని సంక్షేమ ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలన్నా.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ లాంటి నాయకుడి మార్గదర్శకత్వం దేశానికి ఎంతో అవసరం.
– కల్వకుంట్ల వనజ, సర్పంచ్, మోహినికుంట (ముస్తాబాద్ మండలం)