మృతదేహాన్ని తీసేందుకు ముందుకురాని గ్రామస్తులు
సాహసం చేసి బావిలోకి దిగిన ఎస్సై ఏడుకొండలు
గ్రామస్తుల ప్రశంసలు
తాండూరు రూరల్, మార్చి 31 : ఓ వ్యక్తి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. బావిలో నుంచి మృతదేహాన్ని తీసేందుకు బంధువులు, గ్రామస్తులు, ఇరుగు పొరుగు వారు ఎవరూ ముందుకు రాలేదు. విధి నిర్వహణలో ఉన్న తోటి పోలీసులు కూడా సాహసం చేయలేదు. ఎవరైనా బావిలోకి దిగుతారేమోనని సుమారు 15 నిమిషాలు ఎస్సై ఏడుకొండలు వేచి చూశారు. ఎవరూ ముందుకురాకపోవడంతో కరణ్కోట ఎస్సై ఏడుకొండలు సాహసం చేసి చిమ్మచీకటి ఉన్న బావిలోకి దిగాడు. తాండూరు మండలం, కొత్లాపూర్ గ్రామ సమీపంలోని శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయ సమీపంలోని బావిలో అదే గ్రామానికి చెందిన రాయిపల్లి నర్సింహులు (30) దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం పోలీసులు మంగళవారం మధ్యాహ్నం సర్పంచ్ సాయిలు రూరల్ సీఐ జలందర్రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు మోటార్ల సహాయంతో నీటిని తోడేందుకు 8 గంటల సమయం పట్టింది. రాత్రి 9.30 గంటల వరకు నీటిని తోడేశారు. అనంతరం మృతదేహం ఆనవాళ్లు కనిపించింది. బావిలోని తీసేందుకు గ్రామస్తులు ముందుకు రాలేదు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎస్సై ఏడుకొండలు బావిలోకి దిగి నర్సింహులు మృతదేహాన్ని పైకి తీసుకువచ్చాడు. ఎస్సై చేసిన సాహసానికి గ్రామస్తులందరూ ప్రసంశలతో ముంచెత్తారు.