అన్నదాతల సంక్షేమమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం అద్భుత పథకాలను అమలు చేస్తూ రైతన్నలకు తోడు, నీడగా నిలుస్తున్నది. వ్యవసాయం పండుగలా సాగాలని సాగు పనులు మొదలుకుని పంట చేతికొచ్చేవరకు అండగా నిలుస్తున్నది. పెట్టుబడి సాయం, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, రాయితీపై వ్యవసాయ పనిముట్లనూ అందజేస్తున్నది. పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరను చెల్లిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో 55వేల పైచిలుకు బోర్లకు ఉచితంగా కరెంటును సరఫరా చేస్తున్నది. ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కోసం రైతుబంధు కింద రూ.1712.8 కోట్లను అందజేసింది. వివిధ కారణాలతో 2,724 మంది రైతన్నలు మృతి చెందగా, వారి కుటుంబీకులకు రైతుబీమా కింద రూ.136.2 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. రైతువేదికలను సైతం నిర్మించి సాగులో నూతన పద్ధతులపై శిక్షణా శిబిరాలనూ నిర్వహిస్తున్నది. వ్యక్తిగత కారణాలు, అప్పులతో ఆత్మహత్య చేసుకుంటే వ్యవసాయ అప్పులతోనే రైతులు మృతి చెందారంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరిగి, అక్టోబర్ 26 : రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. దేశానికే దిక్సూచిలాంటి పథకాలు అమలు చేస్తూ రైతన్నకు తోడుగా నిలుస్తున్నారు. పంట సాగుకు అవసరమైన పెట్టుబడి దగ్గర నుంచి సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నారు. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే వరకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. చివరకు ఏ కారణంగా రైతు మృతిచెందినా ఆ కుటుంబంలోని నామినీకి రూ.5లక్షలు బీమా డబ్బులు అందజేస్తున్నది. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నది తెలంగాణ సర్కారు.
పెట్టుబడి సాయం 1712.8కోట్లు..
రైతులకు పెట్టుబడులకు ఇబ్బంది కలుగరాదనే ఉద్దేశంతో సర్కారు అమలు చేస్తున్న రైతుబంధు కింద వికారాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు రూ.1712.8కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందజేసింది. 2018 వానకాలం నుంచి రైతుబంధు పథకం ప్రారంభమైంది. మొదట సీజన్కు ఎకరాకు రూ.4వేలు చొప్పున ప్రభుత్వం అందజేసింది. 2019 నుంచి ఈ పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5వేలు ఒక సీజన్కు పెంచడం జరిగింది. ఈ లెక్కన 2018 వానకాలంలో 1,91,649 మంది రైతులకు రూ.218.19కోట్లు, యాసంగిలో 1,73,417 మందికి రూ.203.3కోట్లు, 2019 వానకాలంలో 1,84,644 మందికి రూ.236.87కోట్లు, యాసంగిలో 1,49,469 మందికి రూ.167.07కోట్లు, 2020 వానకాలంలో 2,10,187 మందికి రూ.293.67కోట్లు, యాసంగిలో 2,16,064 మందికి రూ.297.06కోట్లు, 2021 వానకాలంలో 2,22,132 మందికి రూ.296.64కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
రైతుబీమా కింద రూ.136.2కోట్లు
రైతు ఏ కారణంతో చనిపోయినా రూ.5లక్షలు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. 2018 నుంచి రైతుబీమా పథకం అమలులోకి వచ్చింది. రైతులు ఒక్క రూపాయి చెల్లించకుండానే ఈ బీమా సదుపాయం కోసం ప్రభుత్వం రైతుల తరఫున ఎల్ఐసీకి ప్రీమియం డబ్బులు చెల్లిస్తుంది. ఈ పథకం ప్రారంభించిన మొదట్లో ఒక్కో రైతు తరఫున రూ.2,735 ప్రీమియంగా ప్రభుత్వం చెల్లించేది. ప్రస్తుతం ఒక్కో రైతు తరఫున ప్రీమియంగా రూ.4,100 చెల్లించింది. ఇప్పటివరకు జిల్లా పరిధిలో 2,823 మంది రైతులు చనిపోవడంతో రైతుబీమా కోసం దరఖాస్తు చేయగా, 2,724 మందికి రూ.136.2కోట్లు బీమా డబ్బులు విడుదలయ్యాయి. 2018 సంవత్సరంలో 779 మంది రైతులు మృతిచెందగా 769 మందికి రూ.38.45కోట్లు, 2019లో 807 మంది మృతిచెందగా 791 మందికి రూ.39.55కోట్లు, 2020లో 1153 మంది మృతిచెందగా 1095 మందికి రూ.54.75కోట్లు, 2021లో ఇప్పటివరకు 84 మంది రైతులు మృతిచెందగా 69 మందికి రూ.3.45కోట్లు రైతుబీమా డబ్బులు నామినీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడ్డాయి. రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా రెండు కార్యక్రమాలు ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందడం గమనార్హం.
24 గంటలు ఉచిత కరెంటు
వికారాబాద్ జిల్లా పరిధిలోని 19 మండలాల్లో 55వేల పైచిలుకు వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వాటికి నిరంతరాయంగా 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ను సర్కారు అందజేస్తుంది. గత పాలకుల హయాంలో 6 గంటల విద్యుత్ సైతం రోజుకు ఎపుడు వస్తుందో, ఎపుడు పోతుందో తెలియని పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన సీఎం కేసీఆర్ రెండేళ్లలోనే కరెంటు కష్టాలు దూరం చేస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు. గతంలో బోరులో నీరున్నా కరెంటు లేక పంటలు ఎండిపోయేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరెంటు నిరంతరాయంగా సరఫరా జరుగుతుంది. ఇందుకు సంబంధించి ప్రతి సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపునకు చర్యలు చేపట్టారు. అనేక సబ్స్టేషన్లలో అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. తద్వారా నాణ్యమైన కరెంటు రైతులకు 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా అందజేస్తున్నది. రైతుకు అవసరమైనప్పుడు వెళ్లి.. తమ పంటలకు నీరు పెడుతున్నారు. గతంలో ఆటోమేటిక్ స్టార్లర్లు ఉండేవి. కరెంటు వచ్చినపుడు బోరు మోటారు ఆన్ అయ్యేలా ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం కరెంటుకు ఇబ్బంది లేకపోవడంతో పంటకు అవసరమైన సమయంలో రైతులు నీరు పెడుతున్నారు.
97 క్లస్టర్లలో రైతువేదికలు
ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటుచేసిన సర్కారు రైతులకు వ్యవసాయ పంటల సాగుకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి, రైతులు కూర్చొని తమ పంటల మార్కెటింగ్ ఇతర అంశాలు మాట్లాడుకోవడానికి ప్రతి క్లస్టర్లో ఒక రైతువేదిక నిర్మాణం చేపట్టడం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 97 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో రైతువేదికను రూ.22లక్షలతో నిర్మాణం చేపట్టారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 97 క్లస్టర్లలో రూ.21.34కోట్లు ఖర్చు చేసి రైతువేదికల నిర్మాణం జరిగింది. తద్వారా ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులకు శిక్షణా శిబిరాలు ఈ వేదికలలోనే కొనసాగుతున్నాయి. ఇవేకాకుండా రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నారు. ఏ విత్తనాలు ఎంతమేరకు అవసరం, ఆయా సీజన్లలో నెలల వారీగా ఏ ఎరువులు ఎంత మోతాదులో జిల్లాకు అవసరమనేది అంచనా వేసి జిల్లాలోని పలుచోట్ల ఎరువుల బఫర్ స్టాకు ఏర్పాటు జరుగుతుంది. తద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటున్నాయి.
ప్రతిపక్షాల దుష్ప్రచారం..
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తుండగా, వీటిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు, విమర్శలు చేస్తున్నాయి. రైతుబీమాకు సంబంధించి రైతు ఏ కారణంగా చనిపోయినా రూ.5లక్షలు బీమా సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుంది. పట్టాదారు పాసు పుస్తకం కలిగివుండి, బీమా ఎన్రోల్ చేయించుకున్న రైతు చనిపోతే వారు సూచించిన నామినీ బ్యాంకు ఖాతాలో వారం రోజుల్లోపు రూ.5లక్షలు బీమా డబ్బులు జమవుతున్నాయి. రైతులు ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నా అప్పులబాధతో ఆత్మహత్యలంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం విడ్డూరమని, ఇటీవల ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా ముగ్గురు వేర్వేరు కారణాలున్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీల విమర్శలే విడ్డూరంగా ఉన్నాయి. గతంలో ఈ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే సాయం అందించకపోగా, మొసలి కన్నీరు కార్చడం తప్ప ఏమి చేయలేని ఆనాటి పాలకులు, నేడు ప్రభుత్వం అన్ని రకాలుగా రైతుల కోసం పనిచేస్తున్నా విమర్శించడం సరైందికాదనే ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది.