మంచాల అక్టోబర్ 23 : రంగారెడ్డి జిల్లాలోని మారుమూల తండా.. సర్కారు నౌకరు సాధించాలన్న పట్టుదలతో ఒకరిని చూసి ఒకరు లక్ష్యంతో చదివి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారు. తహసీల్దార్, డాక్టర్స్తో పాటు పోలీస్ తదితర ఉద్యోగాలను పొంది ఆదర్శంగా నిలిచారు మంచాల మండలం పటేల్చెర్వు తండావాసులు. తండాలో 900 మంది ఓటర్లు ఉండగా, 400 కుటుంబాలు, 1011 జనాభా ఉన్నది. తండావాసులంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తండాలో సన్న, చిన్నకారు రైతులు తమ పిల్లలను కష్టపడి చదివించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉంటూ చదువుకున్నారు. పటేల్చెర్వు తండాలో 60 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగం సంపాదించినవారు తండాలోని చిన్నారుల చదువు కోసం వచ్చే జీతంలో కొంతమేర ఖర్చు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తండా చిన్నదైనా పెద్ద ప్రతిభను చూపి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కష్టపడి చదివి ఉద్యోగం సాధించా..
ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివాను. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదో తరగతి, జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుకున్నా. కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలు కాగా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి కానిస్టేబుల్ సాధించా.
పోలీస్ కావాలన్న పట్టుదల..
పోలీస్ కావాలన్న పట్టుదల ఎక్కువగా ఉండేది. నగరంలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ పోటీ పరీక్షలకు చదువుకునేవాడిని. కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగం పొందాను. కానిస్టేబుల్ నుంచి ఏఎస్సైగా పదోన్నతి పొందడం ఆనందంగా ఉన్నది.
చదువుకునేలా ప్రోత్సాహిస్తున్నా..
పటేల్చెర్వు తండాలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేలా ప్రోత్సాహిస్తున్నా. తండాలో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. తండా బాగు కోసం తమ తోడ్పాటును సైతం అందిస్తుండడం చాలా సంతోషంగా ఉన్నది.