వికారాబాద్, అక్టోబర్ 23 : ప్రతి పంటకు రసాయనిక ఎరువులను వాడుతున్న రోజులివి. అధిక ఖర్చుతో పాటు సరైన దిగుబడి రాక చేతికొచ్చిన పంటను దళారుల పాలు చేసి రైతన్నలు ఆగమవుతున్నారు. కానీ ఓ రైతు రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతో కూరగాయలను పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు వికారాబాద్ పట్టణం కొత్తగడికి చెందిన కెరెళ్లి మల్రెడ్డి. మూడు ఏండ్లుగా తనకున్న 8 ఎకరాల్లో వివిధ రకాల ఆకు కూరలు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. దీంతో భూసారం పెరుగడంతో పాటు అధిక దిగుబడి వస్తున్నది. అంతేకాకుండా పండించిన ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటున్నాయి. డ్రిప్ పద్ధతితో టమాట, వంకాయ, బీరకాయ, ఉల్లిగడ్డ, బెండకాయ, కాకరకాయ తదితర 20 రకాల కూరగాయలు, 7 రకాల ఆకు కూరలను పండిస్తున్నాడు. బోరు, బావి ఉండడంతో సాగునీరు వృథాకాకుండా వాడుతున్నాడు. కూరగాయలను ఇంటింటికీ సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ఎంటెక్ పూర్తి చేసిన కుమారుడు ఈశ్వర్కు చెప్పాడు. దీంతో ఈశ్వర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కేఎంఆర్ అని కొత్త యాప్ను తయారు చేసి, సహజసిద్ధంగా పండించిన కూరగాయలను ఇంటింటికీ సరఫరా చేస్తామని ప్రచారం చేశాడు. దీంతో లాక్డౌన్ సమయంలో చాలా మంది సద్వినియోగం చేసుకున్నారు. కొంత మంది కూలీల సాయంతో పొలం పనులు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు మల్రెడ్డి కుటుంబీకులు. జనవరి 26న అప్పటి కలెక్టర్ పౌసుమిబసు మల్రెడ్డికి ఉత్తమ రైతు అవార్డును అందజేశారు.
ఇంటి వద్దకు కూరగాయలు..
కేఎంఆర్ యాప్లో ఉదయం బుక్ చేసుకున్న వారికి పొలం వద్దే కూరగాయలను ప్యాకింగ్ చేసి డెలివరీ బాయ్ సాయంతో సాయంత్రంలోగా ఇంటికి చేరవేస్తున్నారు. సాయంత్రం బుక్ చేసుకున్నవారిని ఉదయం అందజేస్తున్నారు. ప్రస్తుతం వికారాబాద్ పట్టణంలోని ఆయా కాలనీల్లో సరఫరా చేస్తున్నారు. కూరగాయలను నిలువ ఉంచకుండా ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నామని రైతు ఆనందం వ్యక్తం చేశారు. కూరగాయలతో పాటు పసుపు, అల్లం వంటి వాటిని సైతం సాగు చేస్తున్నారు. చాలామంది పొలం వద్దకు వచ్చి కూరగాయలను తీసుకెళ్తున్నారు.
నిరంతరం కూరగాయల సాగు..
ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశాను. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో సేంద్రియ పద్ధతి, డ్రిప్ పరికరాల సాయంతో కూరగాయలు, ఆకు కూరలు పండిస్తున్నా. కేఎంఆర్ యాప్తో పట్టణ ప్రజలకు మార్కెట్ ధరకే తాజా కూరగాయలను సరఫరా చేస్తున్నాం. ఉత్తమ రైతుగా అప్పటి కలెక్టర్ పౌసుమిబసు అవార్డును అందజేశారు.
నాణ్యతతో పాటు రుచికరంగా..
సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు నాణ్యతతో సాటు రుచికరంగా ఉన్నాయి. యాప్లో బుక్ చేసుకుని తెచ్చుకున్న కూరగాయలు ఎక్కువ రోజులు నిలువ ఉన్నాయి. మార్కెట్ ధరలకు సమానంగా కొనుగోలు చేశాను. ఈ యాప్తో ఇంటి వద్దకు వచ్చి కూరగాయలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. సమయం కూడా వృథా కావడం లేదు.