ఫిట్మెంట్ ప్రకటనతో ఉమ్మడిజిల్లాలో మిన్నంటిన సంబురాలు
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెరుగడంపై ఆనందం
ప్రసూతి సెలవుల పెంపుతో మహిళా ఉద్యోగులు ఖుషి..
పెన్షనర్లకు పలు రకాల లబ్ధి చేకూర్చడంపై మురుస్తున్న వృద్ధులు..
ఉద్యోగ విరమణ వయస్సు పెంపు హర్షణీయం
ప్రమోషన్లతో తీరనున్న ఉద్యోగుల కల
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు.. పలుచోట్ల సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
వికారాబాద్/రంగారెడ్డి, మార్చి 22, (నమస్తే తెలంగాణ) : ఉగాదికి ముందే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సోమవారం అసెంబ్లీలో పీఆర్సీ, ఉద్యోగ విరమణ, పదోన్నతులు, బదిలీలు తదితరాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. లాక్డౌన్తో ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మరోసారి ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చారు. పీఆర్సీకి సంబంధించి చెప్పిన దానికంటే ఒక్క శాతం అధికంగానే ఇస్తామని ప్రకటించారు. గతేడాది కాలంగా పెండింగ్ పీఆర్సీ బకాయిలనూ చెల్లింపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సునూ పెంచుతామని నిర్ణయించారు. ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియనూ సత్వరమే చేపట్టాలని నిర్ణయించింది. కేజీబీవీల్లోని ఉద్యోగినులకు ప్రసూతి సెలవులను ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. సీఎం ప్రకటనతో కలెక్టరేట్ కార్యాలయంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంతటా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ తదితర ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు.
30 శాతం పీఆర్సీ..
ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పీఆర్సీని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేనున్నది. ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు 58 ఏండ్లుగా ఉన్న ఉద్యోగ విరమణ వయస్సును మూడేండ్లు పెంచింది. ఉద్యోగోన్నతుల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేయనున్నది.
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు
అంతర్జిల్లా బదిలీలు..
ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న అంతర్జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అంతర్జిల్లా బదిలీలు, భార్యాభర్తలు ఒకే జిల్లాలో ఒకే యూనిట్, ఒకే మండలంలో భార్యాభర్తలు పనిచేసేలా బదిలీలు చేయనున్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగినులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉద్యోగ, ఉపాధ్యాయ గ్రాట్యూటీని పెంచాలని నిర్ణయించారు. ఉద్యోగ విరమణ గ్రాట్యూటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచారు.
వికారాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లాలో 15వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. పదోన్నతులతో ఖాళీలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వివిధ శాఖలకు చెందిన 7425 మంది ట్రెజరీ నుంచి జీతాలు తీసుకుంటున్నారు. జిల్లా పోలీస్ శాఖలో 938 మంది అధికారుల నుంచి హోంగార్డు వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరే కాకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపుగా రెండు వేల మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 4 వేల మందికిపైగా ఉన్న పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నది.
ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ…
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగానే ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టింది. ఇప్పటి వరకు వికారాబాద్ జిల్లాలోని 80 శాతం ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. మిగిలిన అర్హులైన ఉద్యోగులతో పాటు, అర్హులైన ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం సత్వరమే ప్రారంభించనున్నది. ప్రమోషన్ల తర్వాత ఖాళీలను భర్తీ చేయనున్నది.