పీఆర్సీపై వెల్లువెత్తిన హర్షాతిరేకాలు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
అంబరాన్నంటిన సంబురాలు
పటాకులు కాల్చి స్వీట్లు పంచిన ఉద్యోగులు
పరిగి, మార్చి 22 : 30శాతం ఫిట్మెంట్ సంతృప్తికరమని పీఆర్టీయూ టీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి డి.అమర్నాథ్ అన్నారు. పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో సోమవారం పరిగిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చడంతోపాటు స్వీట్లు పంచి సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సీఎం కేసీఆర్, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పి.శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్రావు, ఎమ్మెల్సీలు కె.జనార్దన్రెడ్డి, కె.రఘోత్తమ్రెడ్డి, పి.రవీందర్లకు పీఆర్టీయూ టీఎస్ జిల్లా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
తాండూరు నియోజకవర్గంలో..
తాండూరు, మార్చి 22: సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ప్రకటించిన వరాలు జల్లుపై హర్షం వ్యక్తం చేస్తూ తాండూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించడం చాలా గొప్ప విషయమని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి తాండూరు విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ద్వారక్నాథ్, ప్రధాన కార్యదర్శి జోన్నల బస్వరాజ్ పాల్గొన్నారు.
తాండూరు రూరల్, మార్చి 22 : ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్సీ 30 శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఉపాధ్యాయులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాండూరు మండలం జినుగుర్తి పాఠశాలలో హెచ్ఎం మృత్యుంజయస్వామి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి కన్వీనర్ రాంలింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్గౌడ్, ఉపాధ్యాయులు నారాయణగౌడ్ ఉన్నారు.
కులకచర్లలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో..
కులకచర్ల, మార్చి 22: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో పీఆర్సీ అమలు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కులకచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్కు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్రెడ్డి, పీఆర్టీయూ నాయకులు పరందాములు, పెంటయ్య, అశోక్కుమార్, నర్సింహులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.