రైతుబంధుతో భరోసా
పెట్టుబడి సాయంతో వ్యవసాయంపై పెరిగిన ఆసక్తి
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అన్నదాతల హర్షం
కులకచర్ల, మార్చి 22 : రైతుబంధు పథకంతో రైతులకు భరోసా కల్పించడంతో మండలంలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుండటంతో అన్నదాతలు వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. గతంలో నాణ్యమైన విత్తనాలు విత్తకపోవడంతో పంటదిగుబడి సరిగ్గా చేతికి రాక చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు పెరిగి పోవడంతో ఆత్మహత్యలకు పాల్పడేవారు. కానీ నేడు సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం రైతుల కష్టాలు తొలిగించాలనే సంకల్పంతో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రతి సంవత్సరం రెండు పంటలకు సాయం అందించగా, మరింత సాయాన్ని అందించేందుకు ఎకరాకు రూ.5వేలు ఇస్తామని ఇచ్చిన హామీమేరకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. దీంతో తమ పంట పొలాలను సాగు చేస్తూ అందిన పెట్టబడి సాయంతో అధిక దిగుబడి సాధిస్తున్నారు.
సాగు విస్తీర్ణం..
కులకచర్ల మండలంలో 9321ఎకరాల్లో 5183మంది రైతులు వరిని యాసంగిలో సాగు చేశారు. వేరు శనగ పంటను 676 ఎకరాల్లో 400మంది రైతులు సాగుచేశారు. ఈ సారి గత వేసవి పంటల కంటే అధికంగానే వరి పంటలను రైతులు పండించారు.
చేయూతనిచ్చిన రైతు బంధు..
కులకచర్ల మండలంలో రైతులకు పంటలను పండించేందుకు రైతు బంధు చేయూతనందిస్తున్నది. రైతులు వ్యాపారుల దగ్గర అప్పలు తీసుకురాకుండా పెట్టుబడి ఖర్చు రైతు బంధు ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుండటంతో రైతులు వరి పంటను పండించేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం 12295మంది రైతులు రైతుబంధుకు అర్హత ఉండగా, వారిలో 11605మంది రైతులు వారి పాసుపుస్తకాలు, ఆధార్, బ్యాంకు పాసు పుస్తకాలు సిద్ధంగా ఉన్నవి. రెండు నెలల కింద రైతు బంధు పొందినవారిలో 11561మంది రైతులకు 12.18కోట్ల డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.