India Pride Project | ఏ గజేంద్రుడికో కష్టం వస్తే విష్ణుమూర్తి వెళ్లి రక్షిస్తాడు. ఏ మార్కండేయుడికో ఆపద ఎదురైతే పరమశివుడు రంగంలోకి దిగుతాడు. మరి.. విష్ణుస్వామి విగ్రహం స్మగ్లర్ల చేతిలో పడితే.. నటరాజమూర్తిని స్వార్థపరులు విదేశాలకు తరలిస్తుంటే.. అడ్డుకునేది ఎవరు? ‘ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్’ ప్రతినిధి విజయ్కుమార్ ఉండనే ఉన్నాడు.
వెలకట్టలేని వారసత్వ సంపదకు నిలయం మన దేశం. అందుకే, వేల ఏండ్ల నాటి పురాతన వస్తు సంపద దొంగలపాలైంది. ఇంకా అక్రమ రవాణాకు గురవుతూనే ఉంది. ఆ సంపద మన జాతిహక్కు. మన సాంస్కృతిక వారసత్వం. వాటిని దొంగతనంగా ఏ దేశంలో దాచినా.. తిరిగి భారత్కు తెచ్చే కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగుతున్నది.
అది 2018వ సంవత్సరం. ఫిబ్రవరి నెల. నెదర్లాండ్స్లో తెల్లవారుజామున 3 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా.. బుద్ధుడి విగ్రహాన్ని తరలిస్తున్నారు. కచ్చితమైన సమాచారం మేరకు కొందరు భారతీయ యువకులు ఎప్పటినుంచో ఓ కన్నేసి ఉంచారు. ఆ అక్రమ తరలింపు ఫొటోలు తీసి, భారత్లో ఉంటున్న విజయ్కుమార్కు పంపారు. అతను వెంటనే తన డాటాబేస్లోని సమాచారంతో చెక్ చేశాడు. బీహార్లోని నలందా బౌద్ధ విహారం నుంచి 1961లో దొంగిలించిన బుద్ధుని కాంస్య విగ్రహం అది. దాదాపు 57 సంవత్సరాల తర్వాత బయటపడింది. ఆలస్యం చేయకుండా ‘ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ (ఐపీపీ)’ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వాళ్లు నెదర్లాండ్స్ అధికారులతో చర్చలు జరిపారు. దాదాపు ఆరు నెలల పాటు విగ్రహాల స్మగ్లర్లను వెంటాడి, వేటాడి.. ఆ బుద్ధుని కాంస్య విగ్రహం విహారానికి చేర్చారు. ఒకటికాదు రెండు కాదు.. విదేశాలకు తరలించిన ఎన్నో విగ్రహాలను తిరిగి మన దేశానికి తీసుకొచ్చేందుకు తమవంతు పోరాటం చేస్తున్నాడు విజయ్కుమార్.
ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్.. హద్దులు దాటిన విలువైన విగ్రహాలను తిరిగి రప్పించేందుకు ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ ఇది. తమిళనాడుకు చెందిన ఎస్ విజయకుమార్, అనురాగ్ సక్సేనా ఆలోచనల్లోంచి పురుడుపోసుకుంది. ఇప్పటివరకూ దాదాపు 300 పురాతన వస్తువులను, పంచలోహ, కాంస్య, బంగారు, మరకత విగ్రహాలను వెనక్కి తీసుకొచ్చారు. 8వ శతాబ్దానికి చెందిన ‘మేకతల యోగిని’ విగ్రహాన్ని లండన్ నుంచి ఇటలీకి తరలించారు. ఆ విగ్రహం 12 వందల ఏండ్ల తర్వాత బయటపడింది. దానిని ఉత్తరప్రదేశ్లోని లోఖారి గ్రామంలోమళ్లీ ప్రతిష్ఠించారు. దానితో పాటుగా బీహార్లో లూటీకి గురైన 8-9 శతాబ్దాల నాటి ‘అవలోకితేశ్వర పద్మపాణి’ విగ్రహం కూడా ఆస్ట్రేలియా, యూకే, అమెరికాకు చేతులు మారి, సింగపూర్లోని మ్యూజియంలో కొలువైంది. ఇలాంటి విలువైన విగ్రహాలను సుభాష్ కపూర్ అనే పేరుమోసిన స్మగ్లర్ అక్రమంగా తరలించేవాడు. ఆ విగ్రహం కోసం ప్రైవేట్ కలెక్టర్లు, ఆర్ట్ డీలర్లతో సంప్రదింపులు జరిపి మళ్లీ యథాస్థానంలో ప్రతిష్ఠించాడు విజయ్.
బ్రిటిష్ పాలన కాలంలో భారతీయ దేవాలయాల నుంచి అనేక కళాఖండాలు, విలువైన పంచలోహ మూర్తులు దోపిడీకి గురయ్యాయి. స్వాతంత్య్రం తర్వాత కూడా విగ్రహాల అక్రమ రవాణా ఆగలేదు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి దేశ, విదేశాలు దాటిస్తూనే ఉన్నారు. యునెస్కో అంచనాల ప్రకారం 1980 నుంచి నేటి వరకూ చోరీకి గురైన విగ్రహాల సంఖ్య 50వేలకు పైగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ విగ్రహాలకు భారీ గిరాకీ ఉంది. కోట్లకు కోట్లు పోసి కొనడానికి సంపన్నులు సిద్ధంగా ఉన్నారు. ఆ కళాత్మకత ఒక కారణమైతే, పురావస్తువుల పట్ల పిచ్చి వ్యామోహం మరో కారణం. ఆ స్మగ్లర్లకు పల్లె పల్లెలో ఏజెంట్లు ఉంటారు. ఈ మొత్తం వ్యవహారంపై ‘ది ఐడల్ థీఫ్’ అనే పుస్తకాన్ని రచించారు విజయ్కుమార్. సింగపూర్ షిప్పింగ్ కంపెనీలో మేనేజర్గా ఉంటూనే.. ప్రాచీన ఆలయాలపై డాక్యుమెంటరీ కూడా చేశాడు
రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా
రతన్ టాటా భుజాలపై చేయి వేసి మరీ మాట్లాడగలిగే ఈ వ్యక్తి గురించి తెలుసా
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఉన్న గంగిరేగు చెట్టు ప్రత్యేకత ఏంటి?
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !