ఎన్నికల్లో గెలిచి, కూటమి కట్టి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అంత సులువైన పని కాదు. కానీ అలాంటి సంకీర్ణాల్లోని పొత్తులను తమకు అనుకూలంగా మార్చుకుని తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో, ఉన్న ప్రభుత్వాలను కూల్చడంలో బీజేపీ ఆరితేరిపోయింది. ‘ఇచ్చట కొంపలు కూల్చబడును’ బోర్డు పెట్టుకుని రాజకీయ కాపురాల్ని కూల్చేస్తోంది.
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలను ప్రభుత్వాల్ని కూల్చడం కోసం యథేచ్ఛగా వాడుకుంటోంది. అయితే తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో, తమకు విధేయులైన నాయకులు సీఎంలుగా ఉన్న రాష్ర్టాల్లో మాత్రం ఈ విభాగాలను ఉసి గొల్పడం లేదు. అయితే ఇటీవల మిగతా రాజకీయ పార్టీలు కూడా బీజేపీ కుట్రలను తెలివిగా, దీటుగా ఎదుర్కొంటున్నాయి. దీంతో బీజేపీ ఆపరేషన్లు వికటిస్తున్నాయి.
పలు రాష్ట్ర ప్రభుత్వాలపై బీజేపీ దర్శకత్వంలోని సీబీఐ,ఈడీ, ఐటీ విభాగాలు, ఆయా రాష్ర్టాల బీజేపీకి ప్రతినిధులుగా ఉన్న గవర్నర్లు రహస్యంగా ‘ఆపరేషన్ కమలం’ వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నాయి. కానీ ఆయా రాష్ర్టాల పాలక పక్షాలు కూడా తమ నాయకుల చాణక్య ప్రతిభతో బీజేపీ కుయుక్తులను తిప్పి కొడుతున్నాయి. అందుకు నిదర్శనమే ఇటీవల ఢిల్లీ, జార్ఖండ్ రాష్ర్టాల పభుత్వాలు విశ్వాస పరీక్షల్లో నెగ్గడం. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కొత్త మిత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఈ మూడు రాష్ర్టాల్లో ఆపరేషన్ కమలం ఎలా వికటించిందో పరిశీలిద్దాం.
ఢిల్లీలో గత 9 ఏండ్లుగా ఆమ్ ఆద్మీ పభుత్వం పాలన సాగుతుంది. ఇది మింగుడు పడని బీజేపీ తన అహంకారాన్ని ఆప్ ప్రభుత్వంపై ప్రదర్శిస్తూ వస్తోంది. కొన్నేండ్లుగా లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ సర్కారుకు సహాయ నిరాకరణ చేయడం ఇందుకు నిదర్శనం. మహారాష్ట్రలో వెన్నుపోటుదారు ద్వారా ప్రభుత్వాన్ని కూల్చిన పథకం ఢిల్లీలో అమలు చేయాలని బీజేపీ భావించింది. రూ.20-25 కోట్లకు కొనుగోలు చేయడానికి నలుగురు ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించింది. అయితే ఆ పాచిక పారకపోవడంతో ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ ఏమీ చేయలేకపోయింది. విషయం పసి గట్టిన కేజ్రీవాల్ బీజేపీకి బుద్ధి చెప్పేందుకు అసెంబ్లీలో బల నిరూపణకు వెళ్లి అందులో నెగ్గారు. అయితే ఇందుకు ప్రతీకార చర్యగా గత రెండు రోజుల నుంచి దర్యాప్తు సంస్థలు ఆప్ ఎమ్మెల్యేల ఆస్తులను తనిఖీ చేస్తున్నాయి.
జార్ఖండ్ విషయానికి వస్తే 30 సీట్లు కలిగిన జేఎంఎం పార్టీ కాంగెస్, ఆర్జేడీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో 26 మంది ఎమ్మెల్యేలు కలిగిన బీజేపీ సీఎం సోరెన్ ను గద్దె దింపేందుకు ఆయన మైనింగ్ లీజ్ వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చింది. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వెంటనే ఎన్నికల సంఘం సీల్డ్ కవర్లో ఆ రాష్ట్ర గవర్నర్కు ఒక నివేదిక పంపింది. ఆ నివేదిక ప్రకారం సీఎం సోరెన్ శాసన సభ్యత్వంపై అనర్హత వేటు పడుతుందని బీజేపీ నాయకులు జోస్యం ప్రకటించారు. సీల్డ్ కవర్లోని నివేదిక సారాంశం బీజేపీ నేతలకు ఎలా తెలుస్తుంది? అంటే.. అది బీజేపీ రూపొందించిన నివేదికే అయి ఉంటుందని సోరెన్ ఘాటైన విమర్శలు చేశారు. తన ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన సోరెన్ వెంటనే తన శాసన సభ్యులను వేరే రాష్ర్టాలకు తరలించి, అనుకూల సమయంలో వారిని తిరిగి రప్పించి విశ్వాస పరీక్షలో నెగ్గారు. జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలకు ఆశ్రయమిచ్చిన రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ఘడ్ రాష్ర్టాల్లోని ప్రభుత్వ పెద్దలపై గత బుధవారం దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహించాయి. బీజేపీ కక్షపూరిత విధానం ఎలా ఉంటుందో ఈ దాడులను బట్టి అర్థం చేసుకోవచ్చు.
బీజేపీ తనపై ఆర్సీపీ సింగ్ ద్వారా కుట్రకు ప్రయత్నిస్తోందని పసిగట్టిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ మహా ఘట్ బంధన్ కూటమిలో చేరి తన సీఎం స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఆపరేషన్ కమల్ ను ఆపరేషన్ ప్రతిఘటన్తో తిప్పికొట్టారు. రాజస్థాన్లో సచిన్ పైలట్ను తమ వైపుకు తిప్పుకుని అధికారం పొందాలని ప్రయత్నించి బీజేపీ భంగపడింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని భయపెట్టేందుకు ఆమె మేనల్లుడు అభిషేక్, తృణమూల్ పార్టీ నేతలు, మంత్రులపై దర్యాప్తు సంస్థలతో బీజేపీ దాడులు చేయిస్తోంది. తాజాగా తెలంగాణపై ఆ పార్టీ విషం చిమ్ముతోంది. తమ అవివేక నిర్ణయాలను నిరంతరం వ్యతిరేకిస్తున్న ముఖ్యమంతి కేసీఆర్ను గద్దె దించేందుకు దర్యాప్తు సంస్థలతో తెలంగాణలోనూ దాడులకు సిద్ధమైంది. స్థానిక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సీఎం కేసీఆర్ను జైలుకు పంపిస్తాం లాంటి వ్యాఖ్యలు చేయిస్తోంది.
గతంలో తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా కూల్చేస్తామని ప్రకటించిన కమలం పార్టీ విధానం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంలో ఉన్న శ్రద్ధ దేశాభివృద్ధిపై లేదని తెలుస్తోంది. అధికార దాహం తీర్చుకోవడానికి అడ్డ దారులు తొక్కడం ఏమిటని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని ఈసడించుకుంటున్నారు. ఢిల్లీ, బీహార్ సీఎంలు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం పోశాయి. ఈ చర్యలు బీజేపీకి త్వరలోనే తగిన బుద్ధి చెబుతామన్న హెచ్చరికలు జారీ చేశాయి. ప్రజలు తమను కేవలం ఐదు సంవత్సరాల కాలానికే ఎన్నుకున్నారన్న విషయం బీజేపీ పెద్దలు గుర్తు పెట్టుకోవాలి.లేదంటే ఓటర్లు తలచుకుంటే నిరంకుశ ప్రభుత్వాలను కూకటి వేళ్లతో కూల్చేస్తారు.
ఢిల్లీ, బీహార్ సీఎంలు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం పోశాయి. ఈ చర్యలు బీజేపీకి త్వరలోనే తగిన బుద్ధి చెబుతామన్న హెచ్చరికలు జారీ చేశాయి. ప్రజలు తమను కేవలం ఐదు సంవత్సరాల కాలానికే ఎన్నుకున్నారన్న విషయం బీజేపీ పెద్దలు గుర్తు పెట్టుకోవాలి. లేదంటే ఓటర్లు తలచుకుంటే నిరంకుశ ప్రభుత్వాలను కూకటి వేళ్లతో కూల్చేస్తారు.
– పిన్నింటి విజయ్కుమార్
90520 39109