లక్నో: ఏటా శ్రావణ మాసంలో జరిగే కాంవడ్ యాత్రను కరోనా దృష్ట్యా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు రద్దు చేశాయి. అయితే యాత్ర రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సూచించింది. ఏటా ఆనవాయితీగా వస్తున్న ఈ యాత్రకు అనుమతించాలని, ఈ అంశాన్ని ప్రత్యేకమైనదిగా పరిగణించకూడదని వీహెచ్పీ జాయింట్ జనరల్ సెక్రెటరీ సురేంద్ర జైన్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయినా ఈద్-ఉల్-అధాకు కేరళ ప్రభుత్వం సడలింపులు ఇచ్చిందని, దీనిని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కంవడ్ యాత్రకు అనుమతించాలని కోరారు.
కరోనా వ్యాప్తి ఆందోళనల దృష్ట్యా కాంవడ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇప్పటికే ఈ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఉత్తరప్రదేశ్ మాత్రం యాత్రను నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే మతం, మనోభావాల కంటే జీవించే హక్కు గొప్పదని సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీచేసింది. దీంతో శనివారం యాత్రను రద్దు చేస్తూ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ యాత్రలో కోట్లాది మంది శివ భక్తులు పాల్గొని గంగా జలాలను సేకరించి, శివలింగాలకు అభిషేకం చేస్తుంటారు.