న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అత్యధిక సంఖ్యలో క్రియాశీలక కేసులున్న 10 నగరాల్లో ఎనిమిది మహారాష్ట్రకు చెందినవేనని తెలిపింది. పూణే, నాగ్పూర్, థాణే, ముంబై, అమరావతి, జల్గావ్, నాసిక్, ఔరంగాబాద్ నగరాల్లో కరోనా పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉన్నదని పేర్కొంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 60 శాతం మహారాష్ట్రలో నమోదవుతున్నట్లు వెల్లడించింది. ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరినట్లు పేర్కొంది.
మరోవైపు నాగపూర్లో కరోనా పరిస్థితిని సమీక్షించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అనంతరం మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర గురించి చాలా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. కరోనా కేసుల పెరుగుదల చాలా తీవ్రమైన విషయమని చెప్పారు. వైరస్ను తేలికగా తీసుకోవడమే దీనికి కారణమని అన్నారు. దేశం కరోనా రహితంగా ఉండాలంటే వైరస్ను సీరియస్గా తీసుకోవడంతోపాటు కరోనా నియంత్రణ మార్గదర్శకాలను తప్పక పాటించాలని అన్నారు. తాజాగా పెరుగుతున్న కరోనా కేసుల నుంచి ఈ రెండు పాఠాలు మనం గ్రహించాలని చెప్పారు.
కాగా, మాహారాష్ట్రలోని నాగపూర్లో గత 24 గంటల్లో 1800కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి 21 వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.