‘ఇండియన్ స్క్రీన్పై ఇప్పటివరకు రాని కథాంశమిది. ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఉంటుంది. ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.. లేదంటే ప్రపంచమే వినాశనం అవుతుందనే పాయింట్కు చక్కటి క్యారెక్టరైజేషన్స్ను జోడించి దర్శకుడు ప్రభుసాల్మన్ ఈ సినిమాను తెరకెక్కించారు’ అని అన్నారు కథానాయకుడు వెంకటేష్. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘అరణ్య ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానా, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రభుసాల్మన్ దర్శకుడు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది.
ఈ నెల 26న విడుదలకానుంది. వెంకటేష్ మాట్లాడుతూ ‘అరణ్య పాత్రకు రానా ప్రాణం పోశాడు. నటుడిగా నాకే ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగాడు. రానాను చూస్తుంటే గర్వంగా ఉంది’ అన్నారు. రానా మాట్లాడుతూ ‘నా ఫాదర్ క్యారెక్టర్కు వాయిస్ ఓవర్ను చిన్నాన్న వెంకటేష్ ఇచ్చారు. ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు అడవిలో ఉన్నా.. ప్రకృతి గొప్పతనంతో పాటు మనుషుల చేసే అన్యాయాల్ని చాటిచెప్పే చిత్రమిది. పట్టణీకరణ వల్ల పర్యావరణం ఎలా వినాశనానికి గురవుతుందో సందేశాత్మకంగా చూపించాం’ తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, రచయిత సాయిమాధవ్ బుర్రా పాల్గొన్నారు.