హైదరాబాద్: రైతు ధర్నా పేరుతో రైతులు లేని ధర్నా నిర్వహించి బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలపై ఎంపీ అర్వింద్ పచ్చి అబద్ధాలు చెప్పాడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బాల్కొండ నియోజకవర్గంలో కప్పల వాగు, పెద్దవాగుపై ఇప్పటికే నిర్మించిన, మంజూరైన చెక్ డ్యాంల నిధులపై అర్వింద్ అబద్ధాలను మంత్రి ఆధారాలతో సహా ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చుతో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టిందని, కేంద్ర ప్రభుత్వానిది ఒక్క రూపాయి కూడా లేదన్నారు. కప్పల వాగు, పెద్ద వాగు మీద ఎన్ని చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామో ఎంపీ అర్వింద్కు కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు.
ఎంపీ అర్వింద్ లేవనెత్తిన చెక్ డ్యాంల నిర్మాణ నిధులపై ఆధారాలన్నీ బాల్కొండ నియోజకవర్గ ప్రజల ముందుంచారు. 10 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.66 కోట్లు ఖర్చు అయితే అందులో 20 కోట్లు నాబార్డు ద్వారా రుణం తెచ్చామని, అది కూడా వడ్డీతో సహా నాబార్డుకు కేసిఆర్ ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. మిగతా 46 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని వెల్లడించారు. మంజూరైన మొత్తం 27 చెక్ డ్యాములకు రూ.177 కోట్లలో రూ.20 కోట్లు మాత్రమే నాబార్డు రుణం అని, మిగతా రూ.157 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానివే అని తేల్చిచెప్పారు.
ఈ నిధుల్లో కేంద్రానిది నయా పైసాలేదని పునరుద్ఘాటించారు. ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైపోతుందనే భ్రమలో అర్వింద్ ఉన్నాడని విమర్శించారు. తన చిన్న పిలుపుతో ఆలోచన చేసి, రైతు ధర్నాను బహిష్కరించిన రైతులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్బంగా హృదయ పూర్వక దన్యవాదాలు తెలిపారు.