హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్ 50 కేజీల విభాగంలో నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన నిఖత్, ఇప్పుడు ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం సొంతం చేసుకోవడం తెలంగాణతో పాటు యావత్ దేశానికే గర్వకారణమన్నారు. ఈ సందర్బంగా నిఖత్ జరీన్కు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల నిఖత్ జరీన్కు ఘన స్వాగతంతో… సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి మంత్రి వేముల వ్యక్తి గతంగా నగదు ప్రోత్సాహకం అందించి మరిన్ని పథకాలు సాధించి తెలంగాణ,నిజమాబాద్ పేరు విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించిన విషయం తెలిసిందే. మరోవైపు కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన నిజామాబాద్ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ను కూడా మంత్రి అభినందించారు. ప్రపంచ స్థాయి క్రీడాకారుల పుట్టినిల్లు నిజామాబాద్ గడ్డ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు.