భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కూరగాయలు అమ్ముతూ పొట్టపోసుకునే వ్యక్తి కూతురు సివిల్ జడ్జిగా ఎంపికై అందరి మన్ననలూ అందుకుంది. మూడుసార్లు రిక్రూట్మెంట్ పరీక్షలో ప్రతికూల ఫలితం ఎదురైనా నాలుగోసారి పట్టుపట్టి పరీక్షను క్లియర్ చేసి న్యాయమూర్తిగా ఎంపికైంది 29 ఏండ్ల అంకితా నాగర్. మూడుసార్లు పరీక్షలో ఫెయిలైనా జడ్జి కావాలనే తన లక్ష్యం నుంచి దూరం కాలేదని అంకిత చెప్పుకొచ్చింది.
నాలుగో ప్రయత్నంలో తాను సివిల్ జడ్జి క్లాస్-11 పరీక్షను పూర్తిచేశానని ఆమె తెలిపింది. జడ్జిగా ఎంపికైన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని వెల్లడించింది. అంకిత తండ్రి అశోక్ నాగర్ ఇండోర్లోని ముసఖేది ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తుంటారు. పరీక్షల కోసం ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత తాను తండ్రి పనుల్లో సాయం చేస్తానని అంకిత చెబుతోంది. న్యాయ విద్యలో డిగ్రీ చేసిన తర్వాత తనకు జడ్జి కావాలని అనుకున్నానని మాస్టర్స్ డిగ్రీ సైతం పూర్తిచేశానని చెప్పింది.
మూడు సార్లు లక్ష్య సాధనలో విఫలమైనా విడిచిపెట్టకుండా తన కల నెరవేర్చుకున్నానని తెలిపింది. సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కోర్టుకు వచ్చిన ప్రతిఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొంది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా తమ కూతురు ధైర్యం కోల్పోకుండా నిలిచిన తీరు ప్రతి యువతికీ ఉదాహరణగా నిలుస్తుందని అంకిత తండ్రి అశోక్ నాగర్ చెప్పారు.