సిద్దిపేట అర్బన్, మార్చి 6: సిద్దిపేట జిల్లా కోహెడలో శనివారం అపురూపమైన చారిత్రక వీరగల్లు విగ్రహాన్ని గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు సామలేటి మహేశ్, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఈ వీరగల్లు విగ్రహం ఒక యుద్ధ దృశ్యంగా ఉన్నదన్నారు. ఒక వీరుడు యుద్ధ్దంలో పలువురితో పోరాడి, అందరినీ చంపేస్తున్న దృశ్యం కనిపిస్తుందని తెలిపారు. యుద్ధ్దంలో పాల్గొనే గుర్రానికి కవచం కప్పడంతోపాటు జీను, కళ్లెం, ఇతర రాచ హోదా అలంకరణలు ఈ విగ్రహంలో ఉన్నాయన్నారు. గుర్రం మీదున్న వీరుడు ఖడ్గప్రహారం చేస్తున్నట్టు, కుడిచేతి పైన ఒక శత్రువు, గుర్రం వెనుక దాని మీద నుంచి పడిపోతున్న ఇంకొక శత్రువు, నేల మీద పడిపోయిన మరో శత్రువు, గుర్రం ముందరి కాళ్ల కింద పడి చనిపోయిన చివరి శత్రువు.. ఆ వీరుడితో పోరాడుతున్నట్టు విగ్రహ స్వరూపం ఉన్నదని తెలిపారు. వీరుని పోరాట యుద్ధ్ద దృశ్యం శిల్పంగా మలచడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని పరిశీలిస్తే వీరగల్లులోని వీరుని ఆహార్యం తలమీది సిగకొప్పు కాకతీయ రాజ్య నిదర్శనాలుగా చెప్పవచ్చన్నారు.
అసలు ఎవరీ వీరగల్లు..?
రాజుల చారిత్రక సౌధాలకు రాళ్లెత్తిన కూలీలు, ఊరూరా రక్షణ బాధ్యతలు తీసుకున్న వీరులు ఈ వీరగల్లు. దొంగల నుంచి, అడవి జంతువుల నుంచి, శత్రు రాజ్యాల వారు రాజ్య పొలిమేరలను ఆక్రమించకుండా నిరంతరం రక్షించినవారే ఈ వీరులు. కొన్ని గ్రామాల్లో వీరగల్లులను హనుమంతులుగా, వీరభద్రులుగా భావించి గుడులు, గోపురాలు నిర్మించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.