తిరుమల : తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం రాత్రి చంద్రప్రభ వాహనంపై వటపత్రశాయి అలంకరణలో మలయప్పస్వామి దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి చంద్రప్రభ వాహనసేవ వైభవోపేతంగా జరిగింది. ఉదయం సూర్యప్రభ వాహనంలో ఊరేగిన శ్రీనివాసుడు.. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
చంద్రప్రభ వాహనం – సకలతాపహరం
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుంచి ఆనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్రెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.