తిరుమల : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. ఉత్సవాలకు 24న అంకురార్పణం చేయనున్నారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వసంతోత్సవాలు ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో 26న స్వర్ణ రథోత్సవానికి బదులుగా తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. మూడు రోజులపాటు మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు ఆలయంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని ఊరేగిస్తారు. ఈ కారణంగా మే 24న కల్యాణోత్సవం, ఊంజలసేవ, మే 25 నుంచి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.
పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో ఈ నెల 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా మే 18న ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, ఊంజలసేవను టీటీడీ రద్దు చేసింది.