న్యూఢిల్లీ : సాయుధ బలగాల్లో కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు చేపట్టే అగ్నిపథ్ స్కీంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అగ్నివీరులకు పెన్షన్లు ఇవ్వకపోవడం పట్ల మోదీ సర్కార్ను ఆయన నిలదీశారు. స్వల్పకాలిక సర్వీసులో పనిచేసే అగ్నివీరులకు పెన్షన్ పొందే హక్కు లేనప్పుడు ఈ ప్రయోజనాలు ప్రజా ప్రతినిధులకు ఎందుకని ప్రశ్నించారు.
దేశాన్ని కాపాడే సైనికులకు పెన్షన్ లేనప్పుడు తానూ పెన్షన్ వదులుకునేందుకు సిద్ధమని వరుణ్ గాంధీ స్పష్టం చేశారు. అగ్నివీరులకు పెన్షన్ అందేలా ఎంపీలు, ఎమ్మెల్యేలు పెన్షన్లు వదులుకోవాలా అని బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాలుగేండ్ల పాటు సాయుధ బలగాల్లో పనిచేసి ఆపై గ్రాట్యుటీ, పెన్షన్ ప్రయోజనాలు లేకుండా 75 శాతం మంది బయటకు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా యువతలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
పలు రాష్ట్రాల్లో హింసాత్మక నిరసనలు మిన్నంటినా అగ్నిపథ్ను కొనసాగించేందుకు కేంద్రం నోటిఫికేషన్లు జారీ చేసి ముందుకెళుతోంది. ఈ పధకంపై నిరసనల నేపథ్యంలో గరిష్ట వయో పరిమితిని 21 ఏండ్ల నుంచి 23 ఏండ్లకు పెంచింది. అగ్నిపథ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసనలకు పిలుపు ఇచ్చాయి.