సొంత ప్రభుత్వంపై ఎంపీ వరుణ్ గాంధీ మళ్లీ ఫైర్ అయ్యారు. బ్యాంకులు, రైల్వే ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన తీవ్రంగా మందిపడ్డారు. ప్రైవేటీకరణ వల్ల చాలా మంది బతుకులు దుర్భరమయ్యే అవకాశాలున్నాయని, చాలా ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణ వల్లే 5 లక్షల మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు పోవడం వల్ల చాలా మంది ఆశలు కూడా ఆవిరైపోతాయి. ఓ ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఎప్పుడూ పెట్టుబడిదారి విధానాన్ని ప్రోత్సహించదు. అంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
గతంలోనూ వరుణ్ గాంధీ ఇవే అంశాలపై కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇక విపక్షాలు కూడా కేంద్రం చేపడుతున్న ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూనే వున్నాయి. తమ ప్రభుత్వం ఇందిరా గాంధీ హయాంలో బ్యాంకుల జాతీయీకరణ చేసిందని, ఇప్పటి ప్రభుత్వం మాత్రం విలీనాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. దీని వల్ల పేద ప్రజలకు ఉపయోగం లేదని, కొందరి ఉపయోగం కోసమే కేంద్రం ఇలా చేస్తోందని కాంగ్రెస్ మరో వైపు మండిపడుతోంది.