VarunGandhi on Lakhimpur Kheri | లఖీంఫూర్ ఖేరీ ఘటనకు, ఖలిస్థాన్ ఉద్యమంతో ముడి పెట్టడాన్ని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తప్పుబట్టారు. మంత్రి పేరెత్తకుండానే ట్విట్టర్ వేదికగా స్పందించిన వరుణ్ గాంధీ.. ఈ ఘటనకు మత ఘర్షణల రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదివారం ఆరోపించారు. అంతకుముందు హత్యకు పాల్పడిన వారిని బాధ్యుల్ని చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
గత ఆదివారం నిరసన తెలుపుతున్న రైతుల మీదుగా కారు నడిపి.. నలుగురు రైతుల మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశీష్ మిశ్రాను ఆరు రోజుల తర్వాత పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దేశవ్యాప్త నిరసనలు, సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆశీష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.
ఈ ఘటనకు మతానికి సంబంధం లేదని, స్థానిక ఉన్నత స్థాయి వర్గ అహంకార పూరిత వ్యక్తి.. నిరసన తెలుపుతున్న పేద రైతుల పట్ల నరమేధానికి పాల్పడ్డారన్నారు. ఈ ఘటనలో న్యాయం కోసం పోరాడతానన్నారు. ఇటీవల వరుణ్ గాంధీని బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.