తిరుమల : ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామివారి ఉత్సవరులకు వేదోక్తంగా తిరుమంజనం, మూలవర్లకు ప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి మాట్లాడుతూ శ్రీమహావిష్ణువు లోక కల్యాణం కోసం వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు.
స్థల మహత్మ్యం ప్రకారం.. తిరుమలలో తొలిపూజ, తొలి నివేదన వరాహస్వామివారికే చేస్తారని చెప్పారు. ప్రతి సంవత్సరం వరాహస్వామి జయంతిని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహిస్తోందని తెలిపారు. వరాహజయంతిని పురస్కరించుకొని స్వామివారి ఉత్సవరులకు తిరుమంజనం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్షప్రసారం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ రమేశ్బాబు, వీజీఓ బాలిరెడ్డి, శ్రీవారి ఆలయ ఓఎస్డీ పాల శేషాద్రి పాల్గొన్నారు.