నాగర్ కర్నూలు :
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్, షాద్ నగర్ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో ఆదివారం మంత్రి సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ శ్రేణులు సమిష్టిగా ప్రతి ఓటరును సంప్రదించి ఓటు అభ్యర్థించాలని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు, ఉద్యోగ కల్పన, ఉద్యోగుల జీత భత్యాలు గురించి వివరించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ ఉన్న తీరును ఓటర్లకు వివరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాలు, ఇక్కడి అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు వారి రాష్ట్రాల్లో ఉన్నాయా అని ఓటర్లు ప్రశ్నించేలా చేయాలన్నారు. టిఆర్ఎస్
పార్టీ కోసం పనిచేసే వారిని పార్టీ కచ్చితంగా గుర్తిస్తుందన్నారు.